Saturday, March 14, 2009

ముంబై ముచ్చట్లు – పరీక్షలు, కాపీలు

ప్రస్తుతం పరీక్షల సీజన్ నడుస్తోంది. పరీక్షలకీ, కాపీలకీ ఉన్న అవినాభావ సంబంధం అంతా ఇంతా కాదు. ఎవరో మహాత్మాగాంధీ లాంటి వాళ్ళు తప్ప – లాంటి వాళ్ళు కాదు, ఆయనొక్కడేనేమో- వేరే ఎవరూ ఆప్రలోభాన్ని ఆపుకోలేరేమో.

నేను అయిదో క్లాసులో ఉండగా జరిగిందిది. సోషల్ బొత్తిగా ఎక్కేది కాదు. చదువుతోంటే చాలా బాగుండేది.  పరీక్షలో రాయాలంటే ఒక్కముక్క వచ్చేదికాదు.  అప్పుడే కాదు, ఆతర్వాత తరగతులలో కూడా అదే పరిస్థితి.  పదో తరగతిలో అయితే అన్ని సబ్జెక్టుల్లోనూ 80 - 90 దాటి, సోషల్ 56 శాతం.  పరీక్ష ముందు ఓరెండురోజులపాటు కూర్చుని చిన్న చీటీలమీద సమాధానాలు రాయడం మొదలెట్టా. ఇంట్లోవాళ్ళందరూ అటూ ఇటూ వస్తూ పోతూ చూసి ‘ఏరా కాపీకొట్టడానికా’ అని పలకరించారు.  లోపల ఉద్దేశ్యం అదే అయినా పైకి బింకంగా అబ్బే లేదు. చదవడానికి ఈజీగా ఉంటుందని ఇలా రాసుకుంటున్నా అని చెప్పి నా పని కొనసాగించా. రోజు గడిచేసరికి ఓపది మంది ఇలా అడిగేసరికి, పది సార్లు ఇదే సమాధానం చెప్పా.  పదిసార్లు అలా అంతరాత్మని వంచించాక లోపల ఆలోచన మెదలయ్యింది. చివరికి నేను చేయబోతున్న పని నాకే నచ్చక రాసిన చీటీలన్నీఅవతల పడేసా. మరుసటి రోజు   పరీక్ష యధాప్రకారం గ్రీకండ్లాటిన్. మా క్లాసుమేటు వాళ్ళన్నయ్య వాళ్ళ తమ్ముడి కోసమో, పక్కనున్న పాలకేంద్రానికొచ్చో మా స్కూలుకొచ్చి నేనేమీ రాయకపోవడం చూసి బోలెడు జాలిపడి వాళ్ళతమ్ముడు రాసేసి అవతల పడేసిన స్లిప్పులు ఏరుకొచ్చి నాకు ఓనాలుగు సమాధానాలు డిక్టేషనిచ్చాడు, మాటీచరు వారిస్తోన్నా వినకుండా. ఆకుర్రాడు మాస్కూలు పూర్వవిద్యార్ధి.  ఆతర్వాతి సంవత్సరాలలో ఎలాస్ఠిక్  బాండుల పుణ్యమా అని (చీటీలు కాళ్ళకి  కట్టుకున్నది వీటితోనే కదా) టెన్తులో జామ్మని మొదటి ఛాన్సులోనే పాసయిపోయాడు.

కాపీలంటే ఇలా చీటీలే అక్కర్లేదు, వేరేరకంగా కూడా చేయచ్చని నాలుగోక్లాసులోనే తెలుసుకున్నా. మాసారు 1 నుండి 20 వరకు అంకెలకి ఇంగ్లీషు స్పెల్లింగులు బోర్డుమీద రాసి తర్వాతి రోజు అప్పచెప్పమన్నారు. మేం అందరం చదువుకుని వెళ్ళాం.  బోర్డుమీద ముందురోజు రాసినవి చెరిపేసాకకూడా లీలగా కనిపిస్తున్నాయి. నావంతు వచ్చినప్పుడు నేను బోర్డు చూసి చెప్పడం మొదలెట్టా. స్పష్టంగా లేకపోవడంతో నట్టుతూ చెప్పా.  మాస్టారు నాలాంటి వాళ్లనెంత మందిని  చూసుంటారో కదా.  నా అతితెలివిని కనిపెట్టి చేతికొచ్చిన డస్టరుతో నన్ను ఓరెండేసి బోర్డుకేసి చూడకుండా చెప్పమన్నారు. ఆదెబ్బలకి కళ్ళల్లో నీళ్ళుతిరిగాయి.  బోర్డుకేసి చూడకుండా గడగడా అన్నీ కరెక్టుగా అప్పచెప్పేసా. అప్పుడు మాస్టారు, అన్నీ తెలిసీ కూడా బోర్డుమీద చూసి ఛీటింగు చేయడం ఎందుకూ అని  కాస్త గడ్డిపెట్టారు.  నాకు కూడా చాలా అవమానంగా అనిపించింది. కరెక్టేకదా, చదవగలిగీ కూడా షార్టుకట్ ఎందుకు అవలంబించాను అని సిగ్గుపడి, శోధించుకుని ఇప్పటివరకూ ఇలాంటి షార్టుకట్ల జోలికి పోలేదు.  షార్టుకట్లదారి దూరంగా ఉంటుందని తెలియచెప్పిన ఆమాస్టారికి ఇప్పటికీ,  ఎప్పటికీ  కృతజ్ఞతలు చెప్పుకుంటా.  కాపీ అన్నది పరీక్షలలో ఐనా, జీవితంలోనైనా మన అభివృద్ధికి ప్రతిబంధకం.  కాపీ మాస్ఠర్లు కొంతకాలం ఎలాగో కాస్త పేరు తెచ్చుకుంటారేమోకానీ కాపీ ఎప్పుడైనా కాపీయే. 

ఆతర్వాత రోజుల్లో నాకు గుర్తున్నంతవరకూ నానుంచి కాపీ కొట్టిన సంఘటనలే కాని నేను కాపీ చేసిన (పరీక్షలలోనే కాక ఇతర విషయాల్లో కూడా) సంఘటనలు లేవు. 

ఇంతకీ ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే, దహనూలో చించనే ఎడ్యుకేషనల్ సంస్థనడుపుతున్న 75 ఏళ్ళ రజనీకాంత్ ష్రాఫ్ అనే ఆయన ఈమధ్య కాపీలు తగ్గించడానికి ఓకొత్త పధ్ధతి ప్రవేశ పెట్టాడు. ఆయన ఏకంగా పిల్లల తల్లిదండ్రులనే పర్యవేక్షకులుగా నియమించాడు. తల్లిదండ్రులముందు కాపీ చేయడానికి సిగ్గుపడతారన్న  సిధ్ధాంతం మేరకు ఆయన ఈ పద్ధతి ప్రవేశపెట్టి  మంచిఫలితాలని సాధించాడు. దీనిలో పాల్గొన్న తల్లిదండ్రులు తమ సంతృప్తిని వ్యక్తపరిచారు.   ఈపెద్దాయన 2001లో అంత్యపరీక్షలకి 4 రకాల పరీక్షా పత్రాలు తయారు చేసి ఎవరికి ఏపేపరొస్తుందో తెలియకుండా చేసాడట.  దీనితో కోచింగు సెంటరు వాళ్ళు తయారు చేసే ఎక్స్పెక్టెడ్ (లీక్ డ్ అని చదువుకోండి) పరీక్షాపత్రాల తయారీని ఆపచ్చని ఆయన వాదన. ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కన్విన్స్ చేసి,  ఈపద్దతి రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టేలా చేసాడు.  

ఈవార్తతోపాటే చదివిన ఇంకోవార్తకూడా పరీక్షలకి సంబంధించినదే. ఒకబ్బాయికి ప్రత్యేకంగా ఏసీ రూములో పరీక్షరాసే సదుపాయం కల్పించారు.  ఆఅబ్బాయికి ఉన్న ఒక అరుదైన చర్మవ్యాధివల్ల అతనికి చెమటగ్రంధులు లేవుట.  అందుకని చెమట పట్టదుట.  చెమట పట్టక పోతే మన శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధమవదట.  జ్వరం వస్తే అంతే సంగతులు.  మనం ఛీ వెధవ చెమట అని మనం విసుక్కు పోయే చెమట మన శరీరానికి ఎంత అవసరమో కదా.   ఈవ్యాధి జన్యుపరంగా వచ్చే Anhidrotic Ectodermal Dysplasia. ఆస్కూలువాళ్ళు చూపించిన ప్రత్యేకశ్రద్ధని  నేను మెచ్చుకుంటున్నా. 

పరీక్షలు రాస్తున్న, రాయబోతున్న విద్యార్ధినీ, విద్యార్ధులకి నా ప్రత్యేక ఆశీస్సులు. 

సత్యసాయి కొవ్వలి

 

Wednesday, March 11, 2009

నే సెలవిచ్చేదేమిటంటే...

తెలుగు బ్లాగరులందరికీ హోలీ శుభాకాంక్షలు.
తెబ్లాలందరూ హోలీ ఉత్సాహంగా జరుపుకుని ఉంటారని ఆశిస్తున్నా. ఉత్సాహం ఏంటీ ఆఫీసుకెళ్ళాల్సి వచ్చింది అంటారా. కొన్ని పండగలకి సెలవుంటే బాగుంటుందనిపిస్తుంది. అలాంటివాటిల్లో హోలీ ఒకటి. అదృష్టం కొద్దీ మహారాష్ట్రీయుల గుడిపడ్వా (కొత్త సంవత్సరం) మన ఉగాదీ ఒకే రోజు కాబట్టి సెలవుంటుంది కానీ, ఢిల్లీలో ఉండగా సెలవే ఉండేది కాదు. మన సంక్రాంతికి కూడా అంతే. తర్వాత కాలంలో జ్ఞానం కలిగిందేమిటంటే మనరాష్ట్రంలో కూడా మిషనరీ స్కూళ్ళ ప్రభావం వల్ల స్కూళ్ళకి సెలవలకీ, మన పండగలకీ లంకె లేకుండా పోయిందని. కానీ మళ్ళీ గాలి మారి కొన్ని స్కూళ్ళు తమ పద్ధతి మార్చాయి. కొన్ని స్కూళ్ళయితే మా స్కూల్లో బొట్టుపెట్టుకుని రావచ్చని, శ్లోకాలు నేర్పుతామని ప్రచారం చేసుకోవడం కూడా నేనెరుగుదును. ఏమైతేనేం, సెలవలు కావలిసినప్పుడు కాకుండా అనవసర రోజుల్లో వస్తున్నాయి. కొన్ని అన్యమత పండగలైతే ఎందుకు జరుపుకుంటారో కూడా చాలామందికి తెలియదు. అయినా ఇంట్లో కూచోక తప్పదు. వీటికి తోడు వర్ధంతులూ, జయంతులూ వస్తే వరుసగా 3-4 రోజులు బేంకులూ, ఆఫీసులూ బందయిపోయి చాలా ఇబ్బందులు. ప్రజల బాధనర్ధం చేసుకుని బాంకులకి వరుసగా 2 రోజులకన్నా సెలవు రాకుండా నిబంధనలు పెట్టారు. లేక పోతే ఎంత ఇబ్బందో కదా.
అవసరం లేనప్పుడు అందుబాటులో ఉండి, తీరా అవసరం అయినప్పుడు లేకుండా పోవడాన్ని అర్థశాస్త్రంలో డిమాండ్ - సప్లై మిస్ మేచ్ అంటాం. ఇలా అసమతుల్యత ఉన్నప్పుడే మార్కెట్లు పుడతాయి. కానీ ఈసెలవలన్నవి ఎవరివి వారికే. నాన్నెగోషియబుల్. నాన్ట్రాన్సరబుల్. దీనిమీద ఒక జోకుంది. ఒక ఉద్యోగి బాస్ దగ్గరకి వెళ్ళి సెలవడుగుతే, బాసు కదా నో అంటాడు. సరే ఏం చేస్తామని ఆఉద్యోగి 'I will take leave of you, sir' అని వచ్చేస్తాడు. ఓమాదిరి ఇంగ్లీషొచ్చిన సారువారు అదెలా కుదురుతుంది, నా సెలవాయనెలా తీసుకోగలడు అని ఉన్న జుట్టునే తెగ పీక్కున్నాడట. నా దృష్టిలో అలా ఒకళ్ళ సెలవలు వేరే వాళ్ళు కొనుక్కోగలిగితే బలే ఉంటుందనిపిస్తుంది. పిదపకాలంలో ఈసెలవలని స్టాకు మార్కెట్ లో కూడా క్రయవిక్రయాలు జరిపే అవకాశం కూడా రావచ్చు. ఇప్పటికే చాలా సంస్థలలో ఎర్న్డు లీవులుంటాయి. కొంత పరిమితికి, నియమాలకీ లోబడి సంస్థకి అమ్ముకోవచ్చు. ఈపధ్ధతిని అన్ని రకాల సెలవలకీ (పండగ సెలవలకి కూడా) అన్వయిస్తే సంవత్సరంలో పని దినాలు పెరుగుతాయి. కావలసినవాళ్లు కావలసినప్పడు సెలవపెట్టుకుంటారు. సెలవలకీ, డబ్బులకీ లంకె ఉంది కాబట్టి (సెలవు వాడుకోక పోతే డబ్బులకింద మార్చుకోవచ్చు కదా) అనవసరంగా సెలవలు వాడరు.
ప్రస్తుతానికి సెలవు

Sunday, March 08, 2009

ముంబై ముచ్చట్లు – గాంధీగారి వస్తువులు

దేశాభిమానం

మన స్వాతంత్ర్యసమరం అన గానే గుర్తుకొచ్చేది  బోసినవ్వుల గాంధీ.  కేవలం మన రూపాయి నోట్లమీద మాత్రమే మిగిలిపోయిన మహాత్ముడు.  ఆయన మీద చాలామంది బురద జల్లి మన సంస్కృతి మీద మనకే రోత కల్పించే కార్యక్రమం చేసారు, చేస్తున్నారు.  ఎవరెన్ని చెప్పినా గాంధీ గాంధీయే.  ఆయన రచనలు పుంఖాను పుంఖలు.  వాటిలో ఆయన స్పృశించని విషయాలు లేవు. 

జెజూ ద్వీపం (కొరియా) లో టెడ్డీ బేర్ మ్యూజియం లో గాంధీ బొమ్మ వాళ్ళ చారిత్రక పురుషుల సరసన పెట్టడం చూసి చాలా గర్వంగా అనిపించింది (క్రింది ఫోటో చూడండి). ఇండియా అనగానే అక్కడి వాళ్ళు  గాంధీ గురించి చదువుకున్నాం అని చెప్తారు.

IMG_0699

 

గాంధీగారు వాడిన 5 వస్తువులని (కంచం, కప్పు, కళ్ళద్దాలు, వాచీ, చెప్పులు) వాటి హక్కుదారుడు జేమ్స్ ఓటిస్ ఈమధ్య వేలం వేసాడు.   అవి ఎవరో కొనేస్తే మన సంస్కృతిని ఎలా కాపాడుకోవాలోనని ఏలినవారితో సహా చాలామంది ఆదుర్దా చెందారు.  వాటిని మన విజయ మాల్యా గారు 1.8 మిలియన్ డాలర్లు పెట్టి వేలంలో కొని కథ సుఖాంతం చేసారు.  నాకైతే ఈవస్తువులు ఓటిస్ చేతికెలా వెళ్ళాయో, ఇన్నాళ్ళూ ఎవరూ వెనక్కి తేవాలని ఎందుకు పూనుకోలేదో తెలియదు.  ఈవిషయం గురించి తెబ్లాలెవరూ స్పందించినట్లు లేదు.  ఎందుకో మరి.

మన సంస్కృతి శాఖ మంత్రి అంబికా సోనీ ప్రకారం ఏలినవారే  మాల్యా ద్వారా కొనిపించాం అని చెప్పారు.  దానికోసం డబ్బులు అమెరికాలో ఉన్న భారతరాయబారి కార్యాలయం ద్వారా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  తనంతట తానుగా కొన్నానని, ఎవరి పనుపునా కాదని, రాయబారి కార్యాలయం నుండి డబ్బుల గురించి సమాచారమేమీ రాలేదని విజయ మాల్యా నొక్కి మరీ చెప్పారు (ఇంకెవరైనా ఇంకేమైనా నొక్కాసారేమో తెలియదు. పాపం శమించు గాక).  ఇంతకు ముందు కూడా టిప్పు సుల్తాను కత్తిని వేలంలో కొని మన దేశానికి తిరిగి తీసుకొచ్చానని కూడా ఆయన గుర్తు చేసారు.  మన ప్రభుత్వం ఓటిస్ తో మంతనాలు జరిపిన  మాట నిజమే.  కానీ ఓటిస్ కొన్ని షరతులు విధించాడు.  అవేమిటంటే- మన ప్రభుత్వం ఆరోగ్యానికి కోటాయింపులు పెంచాలి లేదా గాంధేయ విలువలని ప్రపంచానికి మన రాయబారి కార్యాలయాల ద్వారా వ్యాప్తి చేయాలి. ఇవి మన దేశ సార్వభౌమాధికారానికి దెబ్బ అని ఒప్పుకోలేమని విదేశాంగ మంత్రి ఆనంద శర్మ అన్నారు.  మనం గాంధీని మరిచి పోవడం అనే మన సార్వభౌమాధికారాన్ని  బయటి వాళ్ళు గుర్తు చేయడం తప్పనా.   మొదటి షరతు ఓకే కానీ రెండోది ఏరకంగా దెబ్బో నాకు తెలియలేదు.  అయినా షరతులు పెట్టిన వాడు ఒప్పుదలయ్యే షరతులు, ఉదా. గాంధీ అని ఇంటి పేరున్న వాళ్ళే ప్రధాన పదవులు చేపట్టాలనో లాంటివి, ప్రజా నాయకులకి గాంధీ అలవెన్సివ్వాలనో పెట్టాలి కానీ పేచీకోరు షరతులేంటి.

ఇదిలా ఉండగా, ఓటిస్ దగ్గర గాంధీగారి చితాభస్మం, కాల్చబడిన చోటునుండి తీసిన రక్తం ఉన్నాయిట. అవి కూడా త్వరలో అమ్మచ్చుట.  ఇంతేకాదు, ఇలాంటి జ్ఞాపకాలు, వేరే నాయకులవీ, మన ఇటీవలి చరిత్రకి సంబంధించినవి చాలా ఉండచ్చు.  వీటన్నిటినీ సేకరించి, భద్ర పరచి భావితరానికి అందించేందుకు చేయాల్సిన కృషిని ఈ గాంధీ గారి వస్తువుల వేలం మనకి గుర్తుకు చేస్తోంది.    

పుల్లలు, చెక్కగోళీ తో నేను చేసిన 8 అంగుళాల గాంధీ తాత – మూడు పార్శ్వాలు.

gandhi gandhi profile gandhi side

ముంబై ముచ్చట్లు – భాషాభిమానం

మన జనాలకి అభిమానాలు బాగానే ఉన్నాయి. అందులో భాషాభిమానం, దేశాభిమానం, మతాభిమానం ఈమధ్య బాగానే కనిపిస్తున్నాయి. ఇందులో మొదటి దానికి ఉదాహరణ ఈమధ్య జరిగిన సంఘటనలు.

మొన్న ముంబై మిర్రర్ లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపనీ CEO  ఆనంద్ మహీంద్రా మీద ముంబై మునిసిపాలిటీ తరఫున ఓ గుమాస్తా క్రిమినల్ కేసు పెట్టారని చదివాం. కారణం ఆయన తన కంపెనీ బోర్డుమీద మరాఠీలో రాయకపోవడం. ఎప్పుడో 1948 లో చేసిన ఒక చట్టం ప్రకారం ఆయన నేరస్థుడయ్యాడు. ఆ చట్టం ప్రకారం 50 – 500 రూపాయలు జరిమానా వేయచ్చు. అదీకాక, ఆకంపనీలో ఈబోర్డులూ, గీర్డులూ బాధ్యత ఏ డైరెక్టరుదో నిర్ధారించుకుని వారినే బాధ్యులని చేయాలిట.  వీళ్ళ వెర్రి కాని, భాషాభిమానం ముందు ఈఅడ్డంకులేమిటీ.  ఆమధ్య నవనిర్మాణ సమితి కార్యకర్తలు గూండాగిరీ చేసి మరాఠీలో బోర్డులు లేని షాపులని ధ్వంసం చేసారు.  అదీ ఉత్సాహం అంటే.  భాషాభిమానం చూపించుకునే పధ్దతిదీ.  అన్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్టు రాజ్ ధాకరేని మీరు  మరాఠీ, మరాఠీ అంటూ మీ పిల్లలని ఇంగ్లీషు మీడియంలో ఎందుకు చదివిస్తున్నారని అడిగాడు.  దానికి ఆయన నేను చెప్పేది నాన్-మరాఠీయుల కోసం, మరాఠీయులకి పర్వాలేదని వాక్రుచ్చారు.

మాయల మరాఠీ అన్న ప్రయోగం ఎప్పుడైనా విన్నారా?