Sunday, October 15, 2023

పెద్దలకి మాత్రమే ...., ఏడాదికోసారి

 ఈమధ్య మా పనిమనిషి ఓ రోజు మధ్యాహ్నం పనికి రానంది.  ఏమిటీ విశేషం అంటే వాళ్ళ పెద్దలకి పెట్టుకోవాలని చెప్పింది. నడుస్తున్నవి పితృపక్షం రోజులు కదా. మొన్న అంటే అమావాస్య ముందు రోజు పక్కనున్న చింతల్ బస్తి కూరగాయాల కోసం వెళ్ళా.  కొంతమంది కలగూరకాయలు (assorted vegetables) కొంటున్నారు. ఆర్ధమయింది. పక్క రోజు అమావాశ్య నాడు బ్రాహ్మలకి  స్వయంపాకం (పొత్తర్లు) ఇవ్వడానికి కొంటున్నారని. తర్వాతి రోజు సాయి  బాబా గుళ్ళో పూజారికి కొంతమంది దానం ఇచ్చారు. నాకళ్ళముందే కొంతమంది ఇచ్చారు. సాయంత్రం ఇంకో గుళ్ళో పూజారికి ఒకరు స్వయంపాకం దానమివ్వడం చూసి వెళ్ళి ఏమిటి ఇది అని అడిగాను, ఏమీ  తెలియనట్లుగా.  గతించిన పెద్దలకోసం ఇలా దానం ఇస్తున్నట్లు, ప్రతీ ఏటా ఈ రకంగా ఇస్తున్నట్లు చెప్పారు.  నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. మన దృష్టిలో పెద్ద చదువు సంస్కృతి లేవను కున్న వర్గాల లో కూడా పెద్దల పేరు మీద  ఏడాది కోసారి  ఒక ధర్మ కార్యం చేయడం అది కూడా ఒక శ్రద్ధ తో చేయడం ఒక గొప్ప సంస్కృతి అని అనుకుంటున్నా. మనకి ముందు వెనుకా ఎవరు లేరు మేమే తోపులం అనుకోకుండా  మనకున్నది మన వారసత్వం గా వచ్చినదే, సంపదై నా, సంస్కృతయినా అన్న భావన ఆరోగ్యకరం అని నా భావన. కొన్ని వర్గాలలో ఏటా తద్దినాలు పేరు పేరునా పెట్టడం ఆనవాయితీ. ఆయితే అది కూడా ఒక తప్పనిసరి తద్దినంలాగా శ్రద్ధ లేకుండా ఏదో మఠంలో పెట్టేయడం అవుతోంది.  మా చిన్నప్పుడు నెలకోసారి ఎవరిదో ఒకరిది తద్దినం రావడం, దానికి చుట్టాలందరూ రావడం, పెద్దలకి ఒక తద్దినం లాగానూ (డబ్బులనీ, మనుషులనీ సమర్దించాలంటే మాటలా), పిల్లలకి సంబరంగాను ఉండేది.  పిల్లికి చలగాటం, ఎలక్కి ప్రాణసంకటం అంటే ఇదే మరి. 

పితృపక్షం అంటే హిందుత్వ  ఎజెండా అనో, బ్రాహ్మల  ఆధిపత్యమనో, మనువు చేసిన దుర్మార్గమనో అని నిర్ధారించకండి.   ఈ రకమైన పెద్దలని గౌరవం గా తలుచుకోవడం వేరే దేశాలలో కూడా ఉంది. దక్షిణ కొరియా లో  దీన్ని Chuseok  అనే పేరుతో ప్రతి ఏటా ఘనం గా పండగ లా జరుపుతారు.  ఇది వారికి ఏటా వచ్చే పెద్ద పండుగ. మూడు రోజులు దేశమంతా సెలవుంటుంది.  ఈ పండగ సందర్భంగా బంధుమిత్రులు కలుసుకుంటారు. కానుకలిచ్చి పుచ్చుకుంటారు. పోయిన వారి సమాధుల దగ్గర తినుబండారాలు ఉంచడం రివాజు. ఈ సందర్భంగా దేశమంతా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఎకానమీ అంతా ఒక్కసారిగా  శక్తి పుంజుకుంటుంది. బహుశః  చైనా, జపాను లాంటి దేశాలలో కూడా ఇలాంటి ఆచారాలుంటాయనుకుంటా.  

వీళ్లందరినీ చూసి నేను కూడా కూరలు, పప్పు, బియ్యం లాంటివి మా సాయి బాబా గుడి పూజారి గారికి ఇచ్చి వచ్చా. పితృ పక్షాలలో ఇలాంటి పని చేయడం మొదటి సారేమో.  చాలా సంతోషం కలిగింది, ఇంతమందితో పాటు నేను కూడా 'నేను సైతం' అంటూ  మా పెద్దల్ని తలుచుకుని నా కృతజ్ణత తెలుపుకోగలిగినందుకు.  

నేను మణిపూర్ లో ప్రవాసం లో ఉన్నప్పుడు, అక్కడి వారికి తమ సంస్కృతి, వారసత్వాల పట్ల ఉన్న శ్రద్ధకి చాలా   ఆశ్చర్యపోయా.  వీరు Langban Heisoi Thaba అనే తర్పొణ కార్యక్రమం పితృ పక్షం లో జరుపుకుంటారు అత్యంత శ్రద్ధగా.  కమ్యూనిటీ పక్షాన వారి పాత తరం వీరుల కు తర్పణాలు ఇస్తారు. ఈ సంవత్సరం ఈమధ్య కాలంలో మాతృ భూమికోసం ప్రాణాలని అర్పించిన వారికి తర్పణాలు ఇవ్వాలని ఒక సంస్థ పిలుపిచ్చింది. వీరి ప్రకారం వారికి  ఏడుగురు మూల పురుషులున్నారు. సూచనగా వారి జండాలోనూ, కండువాల్లోనూ, ఇతరత్రా ఏడు రంగులు ఉంటాయి. మన సప్త ఋషులకి, వీరి ఏడుగురు మూలపురుషులకి ఏమైనా సంబంధం ఉందా?  భారతకాలంలో అర్జునుడికి మణిపూర్, ఇతర ఈశాన్య రాష్ట్రాలతో వైవాహిక సంబంధాలున్నాయి.  ఆప్పుడు భారత దేశపు అంతర్భాగం గా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు వేరే దేశాలేమో అనిపించేంత దూరం ఎందుకు  జరిగాయో.  అలాగే ప్రసార మాధ్యమాలు, సాధనాలు ఇప్పుడున్నంత  గొప్పగా లేకపోయినా, ఆసేతు హిమచాల పర్యంతమూ  మన సంస్కృతి, ఆచారాలు, నమ్మకాలు వ్యాపింప చేయగల సత్తా మన పెద్దలు చూపించారంటే నోట మాట రావట్లేదు. ఏది ఏమైనా, ఇది మన పెద్దలకి మాత్రమే తెలిసిన విద్య.   

Monday, June 22, 2020

నేను, మా నాన్న


నేను, మా నాన్న
ఈవేళ పితృదినోత్సవం, సంగీతదినోత్సవం, యోగా దినం కలిసివచ్చాయట. ఫేస్బుక్ లో కొన్ని పోస్టులు చదివేసరికి మానాన్నగారు గుర్తొచ్చారు. ఇక్కడ గారు అని వ్రాసా కాని, ఆయనని నాన్నా అని పిలిచేవాడిని, నువ్వు అని సంబోధించేవాడిని, మాఅక్కా వాళ్ళు వారించినా కూడా.  మన నాన్నే కదా మీరు  అంటే దూరంఅనిపిస్తుంది అని లాజిక్ చెప్పేవాడిని.  వాళ్ళు మాత్రం గౌరవవాచకాలు వాడేవారు.  మానాన్న చాలా తక్కువ మాట్లాడేవాడు. ఆకాలంలో పద్ధతి బట్టి  నాన్నలు గంభీరంగా ఉండేవారు.  మేం కాస్త పెద్దయ్యాక మా మధ్య సంభాషణలు కాస్త బాగానే జరిగేవి.
అప్పటికీ, ఇప్పటికీ మానాన్న నాకుఆదర్శమే. మాకు ఆయన హితబోధలు, ఉపదేశాలు చేసినట్లు అస్సలు గుర్తులేదు. నోరు తెరచి ఇలా చేయండి అని చెప్పినట్లు కూడా గుర్తులేదు. దండించి, ఉతికి భయపెట్టలేదు. గట్టిగా చదవమని చెప్పిన దాఖలాలు కూడా ఏమీలేవు. మమ్మల్ని దండించినది మొదటిసారీ, చివరిసారీ నేను 2వ తరగతిలో ఉన్నప్పుడు.  తర్వాత ఒకసారి దండించే అవకాశాలు వచ్చాయి. మామూలుగా నాన్నలు కొట్టేసందర్భాలే. కానీ మా నాన్న తీరు వేరు. ఒకసారి నేను టార్చిలైటుతో ఆటలాడి, బల్బు విరక్కొట్టా. ఏమీతెలియనట్లు నటించినా, మాఅమ్మ కనిపెట్టి, నాన్నరాగానే చెప్పింది. మానాన్నదగ్గర డబ్బుల సమస్య చాలా ఉండేది. నిత్యావసరవస్తువులకే ఇబ్బందిగా ఉండేది.  అప్పడు బల్బు 75 పైసలు ఉండేది. కరువులో అధికమాసమే. కరంటు ఎప్పుడూ ఉండేది కాదు. కాబట్టి బల్బుకొనకా తప్పదు. ఆర్ధిక ఇబ్బందులున్నప్పుడు, ఇలాంటి పరిస్థితిలో మగాడు ఇంటికిరాగానే పెళ్ళం ఇలాంటి సమాచారం ఇస్తే విచారణకూడా లేకుండా వీపు విమానంమోత అయ్యుండేది. నేనుకూడా మానసికంగా రెడీ అయిపోయా.  మా నాన్న మాత్రం శాంతంగా జేబులో డబ్బులుంటాయి, తీసుకేళ్ళి బల్బు వేయించుకురా అనిమాత్రం అన్నారు. అంతే. కేవలం అంత మాత్రమే. నాలో మథనం, బాధ. నాన్న ఆర్ధికపరిస్థితి తెలుసు. ఆయన మనసులో కలిగిన భావనలు బయటికి తెలియవు. ఆయన ప్రవర్తించిన వైనం వల్ల నాలో కలిగిన పశ్చాత్తాపం, ఆయన కొట్టిఉంటే వచ్చిఉండేది కాదు. ఎప్పటికీ మర్చిపోలేని శిక్ష(ణ). మా అమ్మ ఎప్పుడైనా సరిగా చదవడంలేదు అని కంప్లైంట్  చేస్తే వాడి బాధ్యత వాడికి తెలుసు అని మాత్రం అనేవారు.  ఆమాటతో నామీద ఆయనకున్న నమ్మకాన్ని ఆయనతెలియజేస్తే, దాన్ని నిలుపుకోవడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చేది.
ఏదీ చెప్పకుండా కేవలం తన ప్రవర్తన ద్వారా మమ్మల్ని తీర్చిదిద్దిన ఘనత ఆయనది. ఒకసారి ఒక్క పైసా కూడా లేని స్థితిలో, ఒక్క సిగరెట్టుకూడా లేకుండాఉన్న పరిస్థితి.  ఆసమయంలో ఆయన బావమరిది మా ఇంటికి వచ్చారు.  ఆయన సిగరెట్టు ఆఫరు చేస్తే, సిగరెట్టు మానేసా అని చెప్పారే కానీ ఆయన దగ్గర మాత్రం తీసుకోలేదు.  పక్కనే ఉన్న నేను పొద్దుటినుండి డబ్బులు లేక సిగరెట్టుకాల్చలేదు కదా, ఇప్పుడు ఊరికే వస్తుంటే తీసుకోకపోగా మానేసా అని అబద్ధం చెప్పారేంటా అని అనుకున్నా. తర్వాత అర్ధమైంది. ఎట్టి పరిస్థితులలో అయినా సరే, మన ఆత్మ గౌరవం ఉంచుకోవడం చాలా అవసరం అని. ఎన్నో ఇలాంటి సంఘటనలు నాకు చాలా విషయాలని తెలియచెప్పాయి. ఒకసారి మాత్రం ఒకవిషయం డైరెక్టుగా చెప్పారు, పీ జీ తర్వాత నేను ఢిల్లీకి ఒక చిన్న ఉద్యోగానికి వెళ్తోంటే. చేరేది చిన్న ఉద్యోగమైనా, పెద్దగా ఎదగచ్చు, మీమామయ్య అలాగే ఎదిగాడు అని ఆయన చెప్పిన మాటలు ఎప్పుడూ గుర్తొస్తూ ఉండేవి.  ముఖ్యంగా ఎవరైనా నాది చిన్న ఉద్యోగమని భావన కలిగించడానికి  ప్రయత్నించినప్పుడు.
ఆయన చివరి రోజుల్లో ఆయనకి ఆనందం కలిగించాలని ఒక చిన్న టేపురికార్డు కొన్నాం. ఆయనకి టేపురికార్డరు, డైనింగు టేబుల్ లాంటి చిన్న కోర్కెలు ఉండేవి. తణుకులో స్థిరపడాలని కూడా ఉండేది.  ఒక జత బట్టలు నా పుట్టిన రోజని చెప్పి బహుకరిస్తే, చాలా సంతోషపడి అందరికీ చెప్పుకున్నారని తెలిసింది. ఆచివరి రోజుల్లో తెలిసినదేమిటంటే ఆయనకి హిందీ సినిమాల పరిజ్ఞానం చాలాఉందని. ఆయన చదువుకునే రోజుల్లోని సినిమాల గురించిన విశేషాలు చెప్తుంటే ఆశ్చర్యపోవడం నావంతైంది.  మన అమ్మ, నాన్నలకేం తెలుసో, ఎంత తెలుసో మనకే తెలియక పోవడం ఏం బాగాలేదుకదా.
మా నాన్న కి సంగీతం అంటే ఇష్టం. అప్పుడప్పుడు ఆయన మమ్మలని పక్కన పడుకో పెట్టుకుని చక్కగా పాడేవారు కూడా.  శేషశైలావాసా పాటలో చిరునవ్వులొలుకుచూ నిదురించు నీమోము అని పాడకుండా చిగురించు నీమోము అని పాడడం, మా అమ్మ అలా కాదని అని చెప్పడం, ఆయన కాదని అలాగే పాడడం, ఇప్పటికీ గుర్తుంది.  ఆయన తప్పు పాడడం కూడా మంచిదే అయింది.
నాన్న అనగానే నాకు గుర్తొచ్చేవి ఇంకా రెండున్నాయి. ఆయన నిబ్బరం.  దేనికీ చలించేవారు కాదు ఆయన. దేవుడిపై ఉన్న నమ్మకం వల్ల అంత ధైర్యం అనుకుంటా. రెండోది, ధనాశ లేక పోవడం.  ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, లెక్కలు, ఇంగ్లీషు చెప్తూ చాలా డబ్బులు సంపాదించగలిగినా కూడా, ఇచ్చుకోలేని వాళ్ళకి ఉచితంగా ప్రైవేటు చెప్తూ, ఇవ్వగలిగీ ఎగ్గొట్టిన వాళ్ళని కూడా ఏమీ అనకుండా ఉండేవారు.
నాన్నచాలా కష్టపడి చదువుకున్నాడట. మమ్మల్ని చాలా కష్టపడి చదివించాడు. ఈరోజు  మేం పిల్లాపాపలతో సరిపడా సంపాదనలతో సంతోషంగా ఉన్నామంటే, నాన్న కష్టం, నిస్వార్థం, కలలు ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా నాన్నలాంటి నాన్నని కాగలనాఅని డౌటు.
ఎప్పటికీ అర్ధం కాని విషయం ఏమిటంటే, నాన్న పోయిన మూడున్నర దశాబ్దలలో చాలాసార్లు ఆయన బతికే ఉన్నట్లు కలొచ్చేది. కలేమిటీ, నిజమే కదా. మాజ్ఞాపకాలలో ఆయన చిరంజీవే కదా.   
(నాన్న పేరు కొవ్వలి రమేష్ చంద్రబాబు. కొవ్వలి పద్మనాభరావు, లక్ష్మీకాంతం గార్ల రెండో కొడుకు. ఇరగవరం, తణుకు జిల్లా పరిషత్ హై స్కూళ్ళలో, ఇచ్చాపురం జూనియర్ కాలేజి, పెంటపాడు కాలేజీలలోపనిచేసి, తాడేపల్లిగూడెం కాలేజీలో పనిచేస్తూ జీవితవిరమణ చేసారు. )  

Friday, July 14, 2017

Monday, December 01, 2014

నాకు తెలుగు చేసింది


నాకు తెలుగు చేసింది అన్న శీర్షికతో నా సత్యశోధన బ్లాగులో ప్రచురించిన నా టపాలని కూర్చి ఒక పుస్తకంగా ప్రచురించాను. మన జ్యోతి వలబోజుగారి జేవీ పబ్లిషర్స్ దీన్ని వెలువర్చారు.

Sunday, June 22, 2014

అన్నపూర్ణ - మాదు పిన్ని

ఆమధ్య మా బాబాయి కొడుకు ఫోను చేసి, మా అమ్మ మీద ఒక సావనీరు వేద్దామనుకుంటున్నాము, దానికి ఏదైనా రాయడంతో పాటు దొడ్డ (మా అమ్మ అన్న మాట) దగ్గరనుండి కూడా ఏవైనా అనుభవాలు సేకరించమన్నాడు.  కేవలం గొప్పవాళ్ళ చరిత్రలే రాయబడగలవీ, వాళ్ళ జీవితగాధలే స్ఫూర్తిదాయకాలూ అన్నచారిత్రకస్పృహ మైండంతా నిండిఉండడం వల్ల, తమ్ముడి ఐడియా వెంటనే చెవిదిగలేదు. ఆనక ఆ ఐడియా ఇంతై అంతై బుర్రంతా నిండి, వాటేనైడియా సర్జీ అనేలా చేసింది.  అవునూ, మనలా మామూలుగా బతుకుతూ మనపరిధిలో మనకుటుంబాన్ని పైకి తీసుకురావడానికి చేసిన కృషికి గుర్తింపు అవసరం లేదా?  మనపిల్లలని సరిగా పెంచడం, దానికోసం అవసరమైతే స్వసుఖాలని త్యాగం చేయగలడం, ఆకార్యంలో తన జీవితభాగస్వామికి చేదోడు, వాదోడుగా ఉండడం ఆదర్శప్రాయమూ, గుర్తింపదగిన  ఘనకార్యంకాదా?  అవునని అర్ధం. మనచుట్టూ మన మధ్యనే మనకుటుంబ సభ్యుల్లోనే ఉన్న హీరో, హీరోయిన్లని మనం గుర్తించ(లే)కపోవడం శోచనీయం.  మాపిన్ని కూడా మాకుటుంబంలో ఉన్న చాలామంది  హీరో, హీరోయిన్లలో ఒక నిఖార్సైన హీరోయిన్.

అసలుకి మా పిన్నిగురించి రాయడానికేమైనా ఉందా అని ఆశ్చర్య పోతోంటే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ మా పిన్ని చరిత్రంటే  మాబాబయ్య చరిత్రే అన్న నిజం తెలిసింది. నూటికి నూరు శాతం ఆరోజుల్లో పెళ్ళాల చరిత్రలింతేనేమో.   కానీ మాపిన్నినోట్లోంచి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ తనకి మా బాబయ్యజీవితానికి భిన్నంగా  వేరే జీవితం ఉన్నట్లుగా ఎప్పడూ ఎటువంటి ఫీలింగూ బయటపడలేదు.

ఆమధ్య ఎప్పుడో మాబాబయ్య గురించి నాబ్లాగులో ఒక టపా  వ్రాసా.  దానికి లింకు ఇక్కడ. అది మా బాబయ్యనుద్దేశించి వ్రాసినా, చివరికి మా పిన్ని గురించి రాసినట్లయింది.  మాపిన్ని చిన్నతనంగురించి అడిగితే మా అమ్మ ఏమిటో ఆరోజుల్లో ఒకళ్లగురించి గమనించేంత సమయంఉండేదికాదు, ఎప్పుడూ ఒకరిద్దరు పిల్లలని ఆడిస్తో ఉండడమే పనిగా ఉండేదని, ఆపిల్లలలో ఒకరు మా పిన్నని చెప్పింది.  నలుగురు అన్నలతర్వాత అపురూపంగా పుట్టిన ఆడపిల్ల మా పిన్ని. మాఅమ్మమ్మ మాత్రం ఇది పెద్దయ్యాక అమ్మన్నరాజా (అప్పట్లో ఆఊరి ఎమ్మెల్యేట) లా అవుతుందే అనేదిట.

ఊహ వచ్చిన తర్వాత మా పిన్నిని చూసిన మీదట తన చిన్నప్పుడు ఎంత అందంగా ఉండేదో చెప్పచ్చు.  ఉమ్మడి సంసారంలో ఉన్నప్పుడు మేమందరం పంచుకున్న అనుభవాలూ, అనుబంధాలలో మా పిన్నిపాత్ర కేవలం మా పిన్ని మాత్రమే పోషించగలదనడంలో అతిశయం లేదు. మా అందరి సుఖదుఃఖాలలో అంతగా ఇమిడిపోయింది.
ఆరోజుల్లో తణుకులో మా ఇంటి వెనకాల ఉన్న వేంకటేశ్వరస్వామివారి గుడిలోంచి భక్తిగీతాలొస్తూండేవి. అవి మేం చాలా శ్రధ్దగావింటూండేవాళ్ళం. అందులో ముఖ్యంగా రంగపుర విహారా అన్న ఎమ్మెస్ పాడిన దీక్షితారు వారి కీర్తనని మా పిన్ని కూడా పాడేస్తోండేది.  అప్పుడడిగితే చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నానని చెప్పింది. వెంటనే నాదృష్టి లో మా పిన్ని హీరోయినయిపోయింది. ఆతర్వాత ఎప్పుడు ఆపాట విన్నా మాపిన్నే గుర్తొచ్చేది.

మా పిన్ని మాబామ్మకోడళ్ళలో చివరిదీ, చిన్నదీ అవడంవల్ల ఆవిడ డ్యూటీలు వడ్డనల్లోనూ, వంటింటి బయటా ఉండేవి.  కానీ బాగా వంటచేస్తుందనీ తర్వాత రోజుల్లో తెలిసింది. ఎంతైనా అన్నపూర్ణ కదా.  అది నేను ముంబైనుండి ట్రాన్స్ఫరై హైదరాబాదు వెళ్లాక కొన్ని రోజులు ఒక్కడినే ఉన్న రోజుల్లో, ఒకసారి వాళ్ళింటికి చూడడానికి వెళ్తే తెలిసింది.  సాయంత్రం 7 కి వెనక్కి వెళ్తానని చెప్తే భోజనం చేసివెళ్ళమన్నారు వాళ్ళు.  లేదు, వెళ్ళాలి అని బయలుదేరినవాడినే, వంటింట్లో  మాపిన్నిచేస్తున్న పెసరపప్పు సాంబారు వాసనకి టెంప్టై పోయి, ఒక్కసారింకెవరైనా ఆపితే ఆగిపోవాలని కమిటైపోయా. మీకు వేరే చెప్పాలా. ఒక్కసారి ఇలాంటివాటికి కమిటైతే అవతలవాళ్ళు మళ్ళీచెప్పకపోయినా ఆగిపోవాలని. ఆ అవసరం లేకుండా వాళ్ళు మరొక్కసారి మొహమాటపెట్టడం, నేను వెంటనే మొహమాటపడిపోవడం వల్ల మాంఛి సాంబారు  దొరికింది.

మాపిన్ని టాపికొస్తే మాకందరికీ గుర్తొచ్చేగుణం ఒకటుంది. ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉంటే,  వెంటనే డ్యూటీలో జేరిపోయే అతికొద్ది మందిలో మాపిన్ని ఒకరు.  అది గుర్తింపు రాని పనైనా సరే.  మా అక్క పెళ్ళిలో వేరేవాళ్ళందరూ పెళ్ళింట్లో కనపడే పనిచేస్తూ బిజీగా ఉంటే, గుప్తంగా విడిదిలో ఉండి మొగపెళ్ళివారికి మర్యాదలు చేసిన ఘనత ఆమెదే.
తమకంటూ ఎటువంటి గుర్తింపు ఆశించకుండా, కుటుంబసభ్యుల సౌకర్యమే తమసౌకర్యంగా భావించే మాపిన్ని లాంటివారు మనమధ్యలో ఉండబట్టే మన ఇళ్ళల్లో శాంతి, సౌఖ్యాలు దండిగా ఉంటున్నాయని సెలవిస్తూ,
మీ సత్యసాయి కొవ్వలి

Saturday, December 28, 2013

మొగుడు లేదా పెళ్ళాంతో ఆటలాడుకోండి

ధనుర్మాసం సందర్భంగా జయా టీవీలో ఈనెలంతా సంగీతమే సంగీతం. ఈరోజు నైవేలీ సంతానగోపాలన్ గారి కచ్చేరి. ఆయన పాడేవిధం నాకు నచ్చుతుంది. ఈవేళ మొదటిసారిగా విననాసకొని యున్నానురా అని ప్రతాపవరాళిలో త్యాగరాజస్వామివారి కృతి ఆయననోట విన్నా. దీని పూర్తిపాఠం గూగులమ్మనడిగితే ఇచ్చింది. సాహిత్యం, అర్ధం http://www.gaanapriya.in వద్ద దొరికాయి.
పల్లవి:    విననాసకొనియున్నానురా విశ్వ రూపుడ నే 
అనుపల్లవి: మనసారగ వీనుల విందుగ మధురమైన పలుకుల  ||విననా||

చరణం: సీతా రమణితోనోమన-గుంటలాడి గెలుచుట 
          చేతనొకరికొకరు జూచియా భావమెరిగి 
         సాకేతాధిప నిజమగు ప్రేమతో బల్కుకొన్న ముచ్చట 
         వాతాత్మజ భరతులు విన్నటుల త్యాగరాజ సన్నుత ||విననా||


సీతమ్మతో వామనగుంటలాడి గెలిచాక సీతమ్మవారితో ఆడిన ప్రేమపూరితమాటలు, హనుమంతుడు, భరతుడు విన్నట్లు తనుకూడా వినాలని ఆశ పడి న వైనం ఈపాటలో చెప్పుకున్నారు త్యాగరాజస్వామివారు. పాపం ఆయనవన్నీ చిన్నచిన్న కోరికలే.
అదలా ఉంచితే, ఎంతటి మహారాజైనా ఎపుడో ఏకాంతంలో ఎంతోకొంతతనకాంతను స్మరించుటే సృష్టిలోని చిత్రమైతే, ఎంతటి రాముడైనా సీతమ్మతో వామనగుంటలాడడానికి సమయంవెచ్చించడం మనందరం గమనించిపాటించడం మంచిదేమో.  అసలు ఆటలాడుకోవడం వల్ల మనుషులమధ్య సయోధ్య పెరుగుతుందనీ, ఆరోగ్యకర సంబంధాలు పెంపొందుతాయనీ మనందరికీ తెలుగు వ్యాసాలు రాయడం వచ్చిన దగ్గరనుంచీ తెలిసిన విషయమే.  అసలు మన పెళ్ళిలో పూబంతాట, బిందీ-ఉంగరం, వంటా వార్పూ లాంటి ఆటలు నూతన దంపతుల మధ్య మంచుముక్కలవడానికి (ఐస్ బ్రేకింగన్న మాట) పనికొస్తుందని మనకి తెలిసిన విషయమే. తలంబ్రాలేసుకోవడం కూడాఒకరకమైన ఆటలా సాగడం గమనార్హం. తర్వాతరోజుల్లో మొగుడూ పెళ్ళాల మధ్య ఎన్నిరకాల గేమ్సు నడుస్తాయో మీలాంటి అనుభవజ్ఞులకి వేరే నేచెప్పడమేమిటి, నా ఛాదస్తం కాకపోతే.
అన్నట్లు ఈమధ్య ఓ తెలిసిన ముసలాయనింటికెళ్తే, కాస్త లేటుగా బయటికొచ్చాడు. విషయమేమిటంటే ముసలావిడతో చదరంగమాడుతున్నాడుట. ఎదురెట్టి కాదునుకుంటా లెండి :). చాలా ముచ్చటేసింది. పెళ్ళైన కొత్తలో నేనూ మాఆవిడ  చదరంగం, పేక ఆడేవాళ్ళం (పోట్లాటలు లేనప్పుడు కాలక్షేపం ఉండాలిగా మరి). అదేమిటో పెళ్ళికి ముందు చదరంగమాడితే మాఅవిడ గెలిచేది. పెళ్లయాకా ఎప్పడూ నేనేగెలవడంవల్లనో, సంసారసాగరంలో నిమగ్నమయిపోవడంవల్లనో మా ఆటలు ఎక్కువకాలం సాగలేదు.
కట్ చేసి మళ్ళీ రాముడిదగ్గరకెళ్తే, ఆయన సీతతో ఆడిన వామనగుంటలాట మేం చిన్నప్పుడెప్పుడో ఆడిన గుర్తు. దీనిమీద వికీపీడియా చర్చకి లంకె ఇక్కడ ఇచ్చా. పైనిచ్చిన పాఠం అక్కడిదే.  ఈమధ్య మంకాలా అనే ఆట  మా తమ్ముడూ, మరదలూ యూఎస్ నుండి పట్టుకొచ్చారు. చూస్తే అది వామనగుంటలాటే. అంటే అది ఇంటర్నేషనల్ గేమన్నమాట. అంటే రాముడు అంతర్జాతీయ ఖిలాడీ అన్నమాటేగా (శ్రీలంక టూరెళ్ళాడుగా).
అదలాఉంచితే, ఒకవేళ సాకేతాధిపుడు ఆటలో ఓడి ఉంటే కూడా ప్రేమతో బల్కుకున్న ముచ్చట ఉండేదా అని నాకో డౌటు. ఇదేంటీ, మరీ పెమినిష్టుడౌటులొచ్చేస్తున్నాయనుకుంటున్నారా.
ఈశషభిషలు పక్కన పెట్టి మన పెళ్ళాం లేదా మొగుడుతో ఎఁవేఁవాటలాడుకోవచ్చో ఆలోచించుకొంటే బెటరు.
సర్వేజనా సుఖినోభవంతు.

Sunday, December 15, 2013

ఈ టపా ‘గరికపాటి’ చేయదా?

తెలుగు బ్లాగాభిమానులకు నమస్కారాలు. బ్లాగ్దినోత్సవ శుభాకాంక్షలు (డిసెంబరు 9). ఈ మధ్యన ముఖపుస్తకంలో కామెంటుతూ  కృష్ణ దేవరాయలు పెనుకొండ ఇస్మాయిల్ గారు గడిచిన బ్లాగు కాలాన్ని గుర్తు కి తెచ్చారు.  సరే ఓ టపా కడదామని అనిపించింది. ఈలోపు చదువరి గారు గరికపాటి వారు తమ గుండె తెరిచి ఆర్కే ముందు ఆరేసుకున్నారని మీటిన ట్వీటు చదివి, ఆనక ఆ దృశ్యమాలిక చూశాక నచ్చి మీతో ఇలా పంచుకుంటే బాగుంటుందనిపించింది.రెండు భాగాలుగా దిగుమతి చేసుకున్న వీడియోలు ఆద్యంతమూ (హాస్య)రస భరితంగా ఉన్నాయి. వీటిని యూ ట్యూబు ఇక్కడ (భాగం 1, భాగం 2) లో చూడొచ్చు.  మహావధాని గరికపాటి నరసింహారావుగారిని గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఒకవేళ ఎవరన్నా అడిగినా కూడా, ఆయనని పరిచయం చేయగల సత్తా లేదుకాక లేదు. అందుకని ఆపని పెట్టుకోను. సదరు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఓపెన్ హార్టు విత్ ఆర్కే (ముఖాముఖి) లో గరికపాటివారు చెప్పిన విశేషాలన్నీ చెప్పను. రాలిన ఆణిముత్యాలలో కొన్ని ఇక్కడ రాస్తున్నా.
ఒక సందర్భంలో మనకి చర్చలే కానీ చర్యలుండవు అని గొప్ప సత్యం నాకు చాలా నచ్చింది. ఆయన నాస్తికత్వాన్నించి ఆస్తికత్వం వైపు మళ్ళడం, పిల్లల పేర్లు శ్రీశ్రీ, గురజాడ అని పెట్టడం, అవధానాల్లో కొన్నిసార్లు చుక్కెదురవడం వంటి ఘట్టాలను చెప్పేడప్పుడు ఆయన నిజాయితీ కనిపిస్తుంది.  ఆద్యంతమూ ఆయన నిర్మొహమాటం, మాట నిక్కచ్చితనం, మాటకారి తనం అబ్బుర పరుస్తాయి. ఆర్కే గారిని పొగిడినప్పుడు కాస్త మొహమాటపడ్డారేమో అనిపించింది. ఆయన ధారణ అనితరసాధ్యం అని మనకనిపించినా, ఎవరైనా సాధించచ్చు అని ఆయన సూచించారు.  రెండురెళ్ళెంత అంటే కనీసం కేలుక్యులేటరు ఉంటే కానీ చేయలేకపోతున్నజనాలకి  ఆయన నిత్యజీవితంలో అవధానం ఎలా పనికొస్తుందో చెప్పినది చాలా ఉత్తేజకరంగా ఉండచ్చు. అవధానం అనేది పాండిత్యప్రకర్ష, అవధాని గొప్ప ప్రకటించడం కోసం కాక రోజువారి జీవితంలో ఉపయోగించు కోవచ్చన్నది ఆయన ఉదాహరణలతో చెప్పారు.  ఆయన ఇంట్లో సరుకుల లిస్టు ఒకసారి చూసుకుని బజారుకెళ్ళి ఏవీ వదలకుండా అన్నీ తెస్తారటఆయనకి తరచూ అవసరమయ్యే 50 ఫోను నంబర్లు గుర్తుంచుకుంటారట.
ఒక సందర్భంలో కోరికలేనివాడికి జీవితం గరికపాటి అని తనఇంటిపేరుతో ఒకఛలోక్తి విసిరి తన మాటకారితన్నాన్ని ప్రదర్శిస్తారు. అవధానాల్లో ఎదురైన సవాళ్లు చెప్తూ 10 శాతం వరకూ ప్రతీ అవధానీ అంత సంతృప్తిగా చేయలేని అంశాలుంటాయని నిజాయితీగా చెప్పడంతో పాటు, సచిన్, గంగూలీ, షెహవాగు, ద్రావిడుల పేర్లు వచ్చేలా, తెలుగు గొప్పదనం చెప్పేలా పద్యం చెప్పమని ఇచ్చిన దత్తపదిని ఈ కింది విధంగా పూరించిన విధం ఆయన పట్ల మనకి గౌరవం పెంచేస్తాయి.
బాస చిన్మయముద్రయౌ భాష తెలుగు
పలకగన్ గూలియైనను కుల్కులొలుకు
వస్తనుండెహె కూసెహె వాగకనిననను
ముద్దులొలుకును తనదైన ముద్రవిడదు
గొప్ప పూరణయని చెప్పడం పద్యమంటే తెలియని నాకు దుస్సాహసం.
ఇంకో సందర్భంలో మనవాళ్ళు జ్ఞానానికన్నా, స్నానానికి ప్రాధాన్యత ఇస్తున్నారని నదిలో ఫలానా రోజుని స్నానం చేస్తే పాపాలు పోతాయని చెప్పి జనాలని మోసం చేసేవారిని ఎండగట్టడం ఆనందకరం. ఈమధ్య జనాలు హాస్యాన్ని ఆస్వాదించలేకపోవడం గురించి ఆయనతో పాటు మనంకూడా బాధపడాల్సిందే. ఒకసారి అవధానంలో అప్రస్తుత ప్రసంగంలో ఆరాముడు ఏకపత్నీవ్రతుడు, ఈరాముడు (ఎన్టీ ఆర్) లక్ష్మీపార్వతిని చేసుకోవడమేమిటని అడిగారట. దానికీయన ఈయన ఏన్టీ రాముడు అని, ఆయన ఏకపత్నీవ్రతుడు, ఈయన లోకపత్నీ వ్రతుడు అని చెప్పారట. 
రాష్ట్ర్రం విడిపోవడంపై ఆయన ఓ పద్యం చెప్తూ, ప్రాంతాలు విడిపోవచ్చుకానీ స్వాంతాలు విడిపోకూడదంటారు. లెస్స, లెస్స.
విడదీయగానౌనె వేయేండ్ల పద్యసుగంధమ్ము నన్నయ్య బంధమిపుడు
పంచి ఈయంగనౌనె పశులకాపరికైన పాడనేర్పిన మనభాగవతము
పగులగొట్టగనౌనె భండనమ్మున భద్రకాళిక రుద్రమ్మ కత్తి, ఢాలు
పాయ చీల్చగనౌనె బంగారుతోటలో ఘంటసాలగ పారు గానఝరిని
ప్రాంతములు వేరుపడినను బాధలేదు
స్వాంతములు వేరుపడకున్న చాలునదియె
తెలుగు విడిపోదు చెడిపోదు తెలుగు వెలుగు
రెండుకన్నులతొ ఇకనుండి వెలుగు
గరికపాటి వారు ఉపన్యాసాలని అమ్మ ప్రార్ధనతో మొదలెట్టి, మళ్ళీ కలిసేంత వరకూ తెలుగులో మాట్లాడుకుందాం అని ముగిస్తారట.
మళ్ళీ నేనింకో బ్లాగు టపా రాసేంత వరకూ తెలుగులో మాట్లాడుకుందాం అని నేనంటే నాభాషాసేవ గరికపాటి చేయదా!




Tuesday, November 06, 2012

ఒక అంతర్జాలం - మన తెలుగు - ఇంద్రజాలం : అదీ కథ

జ్యోతి వలబోజు గారు రాసిన  వ్యాసానికి నాకవిత్వం జతచేస్తే వచ్చినదిది. దీని పిడిఎఫ్ ఇక్కడ.
  

తెలుగు సాహిత్యాభివృద్ధికి దోహదించిన అంతర్జాలం (ఇంటర్నెట్) 
  ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదిహేనుకోట్లమందికి పైగా మాట్లాడే భాష తెలుగు. కాని నేడు మాట నేర్చినది మొదలు మాతృభాష కన్నా ఆంగ్లమే ముద్దుగా మారింది.. మీకు నచ్చిన పుస్తకం ఏదని అడిగితే ఎక్కువ శాతం ఇంగ్లీషు నవలల గురించే మాట్లాడుతున్నారు. ఇంగ్లీషులో చదవడం, మాట్లాడడం అలవాటైన తెలుగువారు ఇది మన భాష అని గర్వంగా చెప్పుకోవడం లేదు. ఈ తరం యువతకు తెలుగులో మాట్లాడడం వచ్చినా చదవడం , రాయడం కష్టం అంటున్నారు. అది విని మనసు కలుక్కుమంటుంది. రాబోయే తరం వారు తెలుగు అంటే ఏంటి? ఎలా ఉంటుంది? జిలేబిల్లా ఉంటుంది అదేనా ? అని అడుగుతారో అని సందేహం కలగక మానదు. సర్వం ఇంగ్లీషుమయమైన ఆధునిక కాలంలో తెలుగు మరుగునపడిపోతుందని అందరూ దాదాపు ఖరారు చేసిన తరుణంలో అంతర్జాలంలో తెలుగు ఆవిర్భవించింది.  అది కూడా యువతరం వల్ల.
అంతర్జాలం (ఇంటర్నెట్) ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చేసింది.ఇంతవరకు ఆ కుగ్రామంలో ఏ పని చేయాలన్నా ఇంగ్లీషు మాత్రమే ఉపయోగింపబడేది. కాని ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఇంటర్నేట్‌లో తెలుగు విస్తృతంగా వ్యాపించింది అని గర్వంగా చెప్పుకోగలం. తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించింది అని మురిసిపోయాం, గర్వపడ్డాం. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం త్వరితగతిని అభివృద్ధి చెందుతున్న కారణంగా తెలుగుకు ఆధునిక హోదా లభించింది అని ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. ఎటువంటి ఉద్యమాలు, నినాదాలు లేకుండానే నేడు వెబ్ ప్రపంచంలో తెలుగు వెలిగిపోతోంది.
పెద్ద పెద్ద వ్యాపారస్తులకు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు మాత్రమే కంప్యూటర్ అవసరం అనే రోజులు పోయాయి. స్కూలు పిల్లలకు కూడా కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి అవసరమై పోయింది. ఈ కంప్యూటర్, అంతర్జాలం కేవలం ఇంగ్లీషు వచ్చినవాళ్లకు , సాంకేతిక నిపుణులకు మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటే పొరపాటే. ఇప్పుడు కంప్యూటర్లో చాలా సులువుగా, ఎటువంటి ఖర్చు లేకుండా తెలుగు చదవవచ్చు, రాయవచ్చు. ఉత్తరాలు కూడా తెలుగులోనే రాసి పంపుకోవచ్చు. తెలుగు భాష మీద అభిమానం, నేర్చుకోవాలనే ఆసక్తి, రాయాలనే తపన ఉంటే చాలు. కొన్నేళ్లక్రితం వరకు ఇంటర్నెట్ ఇంగ్లీషులోనే ఉండేది. తెలుగు రాయాలన్నా, చదవాలన్నా కష్టంగా ఉండేది. తెలుగులో రాయడానికి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ కొనాల్సి వచ్చేది. ఇంటర్నెట్ లో తెలుగు వాడకం 90వ దశకం నుండి చివరినుండి మొదలై గత నాలుగేళ్లుగా అతి వేగంగా వ్యాప్తి చెందింది. మాతృభాష మీది అభిమానంతో ఎందరో సాఫ్ట్‌వేర్ నిపుణులు కృషి చేసి కంప్యూటర్లో తెలుగు చదవడం, రాయడం సులభతరం చేసారు. ఇంటర్నెట్ వాడకం ప్రతి ఇంటిలో తప్పనిసరిగా మారిన క్రమంలో తెలుగుబాషా వ్యాప్తి కూడా చాలా వేగంగా జరుగుతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్న తెలుగువారు దగ్గరయ్యారు. ఎంచక్కా తమ మాతృభాషలోనే పరస్పర సంభాషణలు, ముచ్చట్లు , రచనలు చేస్తున్నారు.అంతేకాక ప్రింట్ లో ఉన్న పత్రికలన్నీ ప్రపంచం మారుమూలలకు చేరుతున్నాయి. ప్రతీరోజు ఈ పత్రికలను నెట్ లో పెడుతున్నారు ఆయా పత్రికాధిపతులు. దీనివల్ల తెలుగువారు ఎక్కడున్నా తమ మాతృదేశానికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోగలుగుతున్నారు. 
వృత్తి, ప్రవృత్తిరీత్యా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగువారు ఈనాడు అంతర్జాలంలో ఒక ప్రపంచం సృష్టించుకున్నారు. ఎన్నో బ్లాగులు, వెబ్ సైట్లు, వెబ్ పత్రికలు అచ్చమైన తెలుగుభాషలో ప్రచురించబడుతున్నాయి.  వీటన్నింటికీ విషయసూచికలా పనిచేస్తూ, జాలంలో ప్రచురించీ ప్రచురించగానే పాఠకులకి తెలిపేందుకు కూడలిf, హారం, మాలిక, జల్లెడ లాంటి వెబ్సైట్లు పనిచేస్తున్నాయి.  సందేహనివృత్తికీ, వాదప్రతివాదాలకీ వీలుకల్పిస్తూ వివిధ విషయాలపై చర్చావేదికలు నడుస్తున్నాయి. వీటివల్ల ఔత్సాహికులైన వారు రచయితలుగా వృద్ధి చెందుతున్నారు. . గృహిణులు, విశ్రాంత పండితులు, రిటైరైనవారు సైతం కంప్యూటర్ మరియూ అంతర్జాలాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. పండితులైనవారు తమ వద్ద ఉన్న అపురూపమైన రచనలను బ్లాగులు, వెబ్ సైట్లు, పత్రికల ద్వారా అందుబాటులో ఉంచుతున్నారు. అంతే కాక ఎన్నో పురాణ గ్రంధాలు, ప్రబంధాలు కూడా అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో తెలుగు సాహిత్యాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసి ముందు తరాలవారికి అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.  పాత ఆకాశవాణి శీర్షికలూ, నాటకాలూ, పాటలూ పద్యాలు ఇంకా ఇతర గుప్తనిధులని మాగంటి వారి వెబ్ సైటు అందుబాటులోకి తీసుకువచ్చింది.  దీనివల్ల ప్రపంచంవ్యాప్తంగా అపార సంస్కృతీ సంపద అందుబాటులో ఉంటుంది.  వికీపీడియా అనే అంతర్జాలంలో ఉన్న ఉచిత విజ్ఞానకోశంలోని తెలుగు విభాగంలో ఆంగ్లం తర్వాత అత్యధికసంఖ్యలో వ్యాసాలు కూర్చి, తెలుగులో విజ్ఞానాన్ని జనబాహళ్యానికి అందించిన  ఘనత మనతెలుగువారిదే అని ఇక్కడ సగర్వంగా చెప్పుకోవాలి. 
పొద్దు, ఈమాట, మాలిక, కౌముది మొదలైన  సాహితీ పత్రికలు జాలంలో తెలుగు సాహిత్య ఔన్నత్యానికి ఎనలేని  సేవలందిస్తున్నాయి. కొత్త తరం రచయితలతో పాటు వసుంధర, గొల్లపూడి, మల్లాది వంటి చేయితిరిగిన రచయితలు కూడా అంతర్జాల పత్రికలలో తమ రచనలను ప్రచురించడం గమనార్హం.  సాహితీవైద్యులైన వసుంధర గారు అంతర్జాలంలో కూడా తమ బ్లాగు ద్వారా వైద్యాన్ని కొనసాగిస్తూ అనేకమంది వర్ధమాన రచయితలకు భౌగోళిక హద్దులతో నిమిత్తం లేకుండా ప్రోత్సాహమందిస్తున్నారు.  బ్లాగులు, జాల పత్రికలు, చర్చావేదికలు, వెబ్ సైట్లు వంటి వివిధ మాధ్యమాలద్వారా తెలుగు సాహిత్యంలో అనేక శతాబ్దాలుగా ఆవిష్కరింపబడిన అన్ని రకాల ప్రక్రియలనూ తెలుగువారు కేవలం కొన్నిసంవత్సరాలలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాటి తెలుగు వారితో దాదాపు ఉచితంగా పంచుకొంటున్నారు.  పిల్లల సాహిత్యం, పద్యసాహిత్యం, గద్యసాహిత్యం, కథలు, కథానికలు, పాటలు, సంగీతం, సమస్యాపూరణం, హాస్యం, వ్యంగ్యం, పేరడీ, గళ్ళ నుడికట్టుx ఇలా తెలుగువారికి సంబంధించిన ఏప్రక్రియైనా సరే, అంతర్జాలంలో క్షణాల్లో ప్రత్యక్షం.  అదీకూడా, ముఖ్యపదాలు అందిస్తే చాలు కంప్యూటరు దాని పిలక పుచ్చుకుని మీముందుంచుతుంది.  అది కేవలం ఒక ఇంద్రజాలంలా అనిపిస్తుంది.  అంతేకాక, అనేక కొత్తపదాలను కనిపెట్టి వీరతాళ్ళు వేయించుకున్నారు మన తెలుగు సోదరులు. పొద్దు పత్రిక వారు ఉగాది, దసరా వంటి సందర్భాలలో కవిసమ్మేళనాలు నిర్వహించడం, వాటిలో వివిధ ప్రాంతాల్లో ఉండే కవులు (ఎక్కువ మంది ఈతరం వాళ్ళే) చాటింగు ప్రక్రియ ద్వారా పాల్గొనడంతో పాటు, ప్రేక్షకులు కూడా పాల్గొనగల్గడంతో కవిసమ్మేళనాలకే ఒక ప్రామాణికత తీసుకొచ్చాయనడం అతిశయోక్తి కాదు.  అంతేకాదు, తెలుగువారికి మాత్రమే సొత్తైన అవధాన ప్రక్రియని కూడా అంతర్జాలంలో నిర్వహించి తమప్రత్యేకతను తమదైన రీతిలో చాటుకున్న తెలుగువారికి, వారి సాహితీసేవకి మనందరం జేజేలు చెప్పాలి.
తెలుగువారు కంప్యూటర్ రంగంలో ముందంజవేసి తమ వైశిష్ట్యాన్ని చాటుకోవడంతో పాటు, ఆసాంకేతికనైపుణ్యాన్ని తమ తెలుగుసంసృతిని తమదైన శైలిలో నలుగురితో పంచుకోవడం కోసం వాడుకోవడం ఆదర్శప్రాయం.  మన సాంకేతిక నిపుణులు తెలుగుబాషాభివృద్ధికి తమ వంతు కృషి చేసారు, చేస్తూ ఉన్నారు. అది కూడా నిస్వార్ధంగా,  ప్రతిఫలాపేక్ష లేకుండా. అంతేకాక, జాలంలో సాహిత్యకృషిచేస్తున్న వారిలో అధికతములు పిన్నవయస్కులవడం, పెద్దలూ, పిన్నలూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకుసాగడం గమనించవలసిన విషయం. 
పాశ్చాత్యపు పెనుతుఫానుకు రెపరెపలాడి, మాయమయిపోతుందనుకున్న తెలుగు, ఆ పాశ్చాత్య సాంకేతికాభివృద్ధినే ఆలంబనగా చేసుకుని వటుడింతై, ఇంతింతై అన్నట్లుగా అంతర్జాతీయస్థాయిలో భాసిల్లడానికి కారణం ..ఎందరో మహానుభావులు.  అందరికీ వందనాలు.

 
f తెలుగుని ఆంగ్లలిపిలో రాస్తే తెలుగులోకనిపించేలా చేసే లేఖిని అనే ఉపకరణాన్ని కనిపెట్టిన వీవెన్ దీన్ని ప్రారంభించారు. అంతకూ ముందూ, తర్వాతా ఇటువంటి ఉపకరణాలు వచ్చినా దీనికి అధిక ప్రాచుర్యం వచ్చింది. బరాహా కూడా తెలుగువ్రాయడానికి చాలా ఉపయోగకరమైన ఉపకరణమైంది. తర్వాతికాలంలో ఇన్ స్క్రిప్టు పద్ధతివచ్చి తెలుగుని వ్రాయడాన్నిపూర్తిగా సులభతరం చేసింది. 
x పొద్దు పత్రిక జాలచరిత్రలోనే అపురూపమైన విధంగా అక్కడికక్కడే జాలంలోనే గడినింపే వీలుగా గడి నిర్వహించి చరిత్రకెక్కింది.

Sunday, January 29, 2012

శ్రావ్యవరాళి స్వరసమరం

దూర దర్శన్ లో స్వరసమరం పేరిట కర్ణాటక సంగీతం పోటీలు జరుగుతున్నాయి.  అవి ప్రతీ ఆదివారం రాత్రి 830 నుండి  930 మధ్య ప్రసారమవుతున్నాయి. జనవరి 8 న మా అమ్మాయి పాల్గొన్నమొదటి విడత ప్రసారం అయింది. వాటి వీడియో రికార్డు ఈక్రింద యిస్తున్నా.  విని ఆశీర్వదించ ప్రార్ధన.
మొదటి రౌండులో ఒక వర్ణం, ఒక కీర్తన పాడాలి.

రంజని వర్ణం



కీర్తన - నాగగాంధారి - ముత్తుస్వామి దీక్షితార్ రచన - ఆది తాళం





Tuesday, December 06, 2011

నా కన్నీళ్ళు పాడై పోయింది.. పీడాపోయింది

tears
ఆమధ్యన కొన్నాళ్ళు విండోస్ మొబైలు (ఆసూస్ పి 527) వాడాను. సుమారు ఓఏడాది పాటు. ఆఏడాదంతా నాకు ఏడుపే ఏడుపు. అవడానికి దానిలో చాలా ఫీచర్లున్నాయి, విజిటింగు కార్డ్ రీడరు తో సహా. ఇంకా చాలా ప్రోగ్రాములు దింపుకోవచ్చు.  అయితే ఒకటికి ఇంకో ప్రోగ్రాము ఎక్కిస్తే  మొబైలు సుషుప్తిలోకి జారుకునేది.  ఎవరికైనా ఫోను చేస్తే కట్‌చేసినా కూడా పల్సు రేటు దాటిపోయి నాకు ఇంకో కాలు పోయేదాకా ఆగేది కాదు. కొండొకచో,ఆసూస్ కీ, ఓడఫోను వాడికీ ఏదైనా మోసపూరిత బాంధవ్యమేదైనా ఉందేమోనన్న అనుమానం కూడా వచ్చేది.
అన్నట్లు ఓడఫోనుతో కష్టాలు ఇన్నీ అన్నీ కావు.  అవసరమైనప్పుడు తప్ప ఇతర సందర్భాలలో నిండుగా సిగ్నలుండేది. ఆఫీసులో కూర్చుని మాట్లాడితే, కాస్త అటూ ఇటూ తల కదిపితే సిగ్నలౌట్.  దాంతో మాఆవిడకి (బహుశః వేరేవారికికూడా) కావాలనే కట్చేస్తున్నానేమోనని అనుమానం వచ్చేది. దెబ్బకి తలకి చెక్క ఫ్రేములు బిగించి నట్లు కూర్చుని మాట్లాడాల్సి వచ్చేది. అయినా సమస్యతీరలేదు.  దాంతో వేరే కంపెనీకి మారా.  కానీ హేండ్ సెట్ పారే(డే)యడం అంత సులభం కాదు కదా.. 15 వేలు పెట్టి కొనుక్కున్న తర్వాత. 
అసలు నాకు ఖరీదైన సెల్ ఫోనులు అచ్చిరాలేదేమో అనిపించింది. మా సారొకాయన కూడా అదే అన్నాడు.  నా జీవితంలో మొదటిసారి కొన్నది సామ్సంగ్ ఫోను. బాగానే పనిచేసింది. దాని సిగ్నల్ నీరసపడ్డాక, నోకియా మడత ఫోను కొన్నా.  దాన్లో నాకు నచ్చిన విషయం తెలుగులో వ్రాయగలగడం.  తీరా కొన్ని రోజులు వాడేనే లేదో, కొరియా వెళ్ళాల్సి వచ్చి మా ఆవిడకిచ్చేసా. వెనక్కి వచ్చాక మోటరోలా రాకర్ కొన్నా.  చాలా బాగుంది. ముఖ్యంగా సంగీతంవినడానికి.  కానీ తెలుగు కనిపించేది కాదు.  ఓరెండేళ్ళు వాడానేమో ఎక్కడో పడి పోయింది.  ఆపోవడం కూడా విచిత్రంగా పోయింది. ఇంటినుండి బయలు దేరినప్పుడు ఉంది. ఆఫీసుకి చేరినప్పటికి లేదు. మధ్యలో ఒకచోట  కన్నీళ్ళు (టియర్సు – కళ్ళలో వేసుకునే చుక్కలమందు) కొందామని మందులషాపుదగ్గర కారు దిగా, అక్కడే పడిపోయుంటుంది.  ఆఫోను ఎంత గొప్పదంటే ఒకసారి నిండా వర్షం నీళ్ళలో మునిగిపోయినా కూడా ఎండలో ఎండబెట్టగానే మళ్ళీ పనిచేయడం మొదలెట్టింది.
అదేం విచిత్రమో, నా సెల్ఫోను, కెమేరా ఒకే రకంగా దూరమయాయి.  తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది.  నా కెమేరా ప్యాంటు జేబులో పెట్టుకుని ఒక నదిలో రేఫ్టింగుకి వెళ్ళా. పాపం అది నీళ్ళలో మునకేయడంవల్ల ఎల్సీడీకి జలుబుచేసింది. ఎండపెట్టాక మళ్ళీ పనిచేయడం మొదలెట్టింది. కట్ చేస్తే .. కేదార్ నాధ్ వెళ్తోంటే ఆ కెమేరా తెలియకుండానే చేతిలోంచి జారి కిందపడిపోయింది.  ఎవరో తీసుకుపోయారు.  కొన్నాళ్ళకి సెల్ఫోను కూడా అదే క్రమంలో ముందు తడిసిముద్దయ్యి, తర్వాత జారిపడి ‘పోయింది’.  
రెండ్రోజులపాటు వైరాగ్యం వెలగబెట్టాక, మా ఆవిడ ప్రోద్బలంతో (అంటే ఆవిడిచ్చిన డబ్బులతో అని కూడా అర్ధం) ఈసారి విండోస్ ఫోను Asus P527 కొన్నా. కొద్దిగా బండగా ఉన్నాకూడా, రఫ్ఫండ్టఫ్ గా వాడినా పరవాలేదని చెప్పి ఆ ఫోను కొన్నా.  ఇంతకు ముందు చెప్పినట్లు ఆఫోనుతో ఏడాది పాటు అనుభవించా.  ఈపాటికే గ్రహించి ఉంటారు .. నాఎలక్ట్రానికోపకరణాలకి జలగండం ఉందని.  ఆసూస్ ఫోనుకి కూడా గండం తప్పలేదు.  ముల్లు, అరిటాకు సామెతని నిజం చేస్తూ, పాపం ఆఫోను నీళ్ళల్లో పడడం వల్లకాక, నీళ్ళే దానిమీద పడడం వల్ల తన మాన ప్రాణాలు పోగొట్టుకుంది. అంతకీ దాన్నికూడా ఎండలో పెట్టా.  రాజుగారు, ఏడు చేపల కధలోలా, మూడు ఉపకరణాలు ఎండబెడితే, రెండే ఎండాయి.  ఆసూస్ ఫోనెండలేదు.  నాల్రోజులు వైరాగ్యం.  ఆఫోను పెట్టిన ఇబ్బందులవల్ల కాస్త ఊరట. కేవలం 1500 రూపాయలఫోనే కొనాలని నిర్ణయించుకుని బజారుకెళ్ళి కేవలం 11000 రూపాయలకే సామ్సంగ్ గేలాక్సీ ఫిట్ ఏండ్రాయిడ్ ఫోను కొనుక్కునొచ్చా. ఈసారి మా అబ్బాయి ప్రోత్సాహంతో.  దాంతో నా అనుభవం మొదట్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఆనందదాయకంగానే ఉందని చెప్పాలి. ఆవిశేషాలు ఇంకోసారి. 
మొత్తం మీద నాకు ఆసూస్ ఫోనుతో కన్నీళ్ళెందుకొచ్చాయా అని ఆలోచిస్తే, ఆసూఁ అంటే కన్నీళ్లని స్ఫురించి జ్ఞానోదయం అయింది. ఇప్పుడు ఈటపా శీర్షిక అవగతం అయిఉంటుంది !!!