Saturday, March 08, 2025

తరాంతరంగం

 

మా ఆనంద్ నగర్ కాలనీ ముసలాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు. రకరకాల వ్యాపకాలు పెట్టుకుంటారు. అలాంటి ఒక వ్యాపకం ఆనందవాణి గృహపత్రిక. కొన్నాళ్ళుగా మూతపడింది. ఈమద్య మళ్ళీ పునరుద్ధరిద్దామని సంకల్పించారు. ముఖ్య సంపాదకులు శ్రీ చోడవరపు సీతా రామ శర్మ గారు నన్ను కూడా ఒకవ్యాసం రాయమని, విషయంకూడా సూచించారు. ఆయనకి నా ధన్యవాదాలు. నావ్యాసం ఇదిగో ఇల్లిక్కడ.... 

రాలమధ్య అంతరాలు మానవ, కుటుంబ సంబంధాలని కుదిపేస్తున్నాయి. ఒకరంటే ఒకరికి పడకుండా చేసి, ఇంట్లోనూ, కార్యాలయాలలోనూ కూడా బంధాలనీ, అనుబంధాలనీ విషమయం చేస్తున్నాయి. గతకాలము మేలు వచ్చుకాలముకంటే, ఈకాలం పిల్లలు ఎలా ఉన్నారంటే, మనకాలంలో మనం ఎలా ఉండేవాళ్లం, పిదపకాలం బుద్ధులు  ...ఇలాంటి వ్యాఖ్యలూ, వ్యాఖ్యానాలూ మనం తరచూ వింటూనే ఉంటాము.  ఇవి ఒక తరం వాళ్ళు తర్వాతి తరంవాళ్ళని ఉద్దేశించి చేసినవే.  అలాగే, ఈ పెద్దవాళ్ళున్నారే, వయసులో పెద్దయితే ఏమిటంటా, పెద్దవాళ్ళు ఏమి అన్నా పడాలా?’, అబ్బ, ఈముసలాళ్ళ ఛాదస్తం భరించలేక పోతున్నాం’. ‘అర్ధం చేసుకోరూ..’, ఇవి పడుచువాళ్ళ ఆక్రోశాలు. ఆవ్యాఖ్యానాలూ, ఈఆక్రోశాలూ తరతరాలుగా ఉంటూనే ఉన్నాయి. ఇవేతరాల అంతరాలు. ఇక్కడ వింత ఏమిటంటే, ఒకప్పుడు ఆక్రోశించిన వాళ్లే ఇప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు.

కొంతమంది పెద్దవాళ్ళు తమ పిల్లల మీద ఉన్న ప్రేమ వల్ల తాము పడ్డ కష్టాలూ, క్లేశాలూ తమపిల్లలు అనుభవించరాదన్న స్వార్ధంతో పిల్లలు ఏమిచేయాలో, ఏమిచేయకూడదో తమతమ అనుభవాల దృష్ట్యా వాళ్ళే నిర్ణయించి పిల్లలకి నిర్దేశాలిస్తారు. బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ లా అన్నమాట.  కొంతమంది తాము వయసులో ఉన్నప్పుడు తీరని కోరికలు వాళ్ల పిల్లలద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉదా. డాక్టరు అవలేని తండ్రి కొడుకుని డాక్టరు చేయడానికి ప్రయత్నించడం లాగా.  కొంతమంది కేవలం తాము చెప్పినట్లు పిల్లలు నడుచుకోవడం క్రమశిక్షణగా, స్వీయ ప్రతిభగా భావిస్తారు. తద్వారా మన పిల్లలకి స్వయం నిర్ణయ సామర్ధ్యం  అలవడదు. 

అటుపక్క ఈతరం కృత్రిమ మేథస్సుది. వారికి ముందటి తరపు భావాలూ, ఆలోచనలూ వెనకబడినవిగా కనపడడంలో ఆశ్చర్యం లేదు. అదీకాక, శంకరాభరణంలో దాసు చెప్పినట్లు పాతతరం పడవలది, ఇప్పటి తరం జెట్లు, రాకెట్లది. ఇంకా చెప్పాలంటే చంద్రయాన్, మంగళయాన్లది. అలా అని ఇప్పటి తరం చేసేవి అన్నీసమర్ధనీయం కాదు. కానీ వారికి ఉన్న ఒత్తిళ్ళు పాతతరం ఎదురుకొన్న వాటికన్నా భిన్నంగానూ, క్లిష్టంగానూ ఉన్నాయనడం అతిశయోక్తి కాదు. వారికి వాటిని ఎదుర్కొనే మానసిక స్థైర్యం ముందుతరానికన్నాతక్కువ. ఉమ్మడి కుటుంబవ్యవస్థ పోవడం, ఏకైకసంతానం కావడం, తల్లిదండ్రులిద్దరూ సంపాదనా పరులవడం వల్ల ఆర్ధికక్రమశిక్షణ లోపించడం, వారికి పిల్లలతో మాట్లాడే సమయం లేకపోవడం వల్ల  పిల్లల్లో పెరిగిన అభద్రతాభావము, దుస్సావాసాలు, వాటి వల్ల వచ్చిన అనేక సామాజిక, మానసిక సమస్యలు దీనికి కొన్ని కారణాలు.

ఇలాగే తరాల అంతరాలతో బతకాలా అంటే అవసరంలేదంటాను. ఇరుపక్షాలూ పరస్పరావగాహన పెంచుకుంటే సరిపోతుంది.  ముఖ్యంగా పెద్దవారే ముందడుగు వేయాలి. మన ఆలోచనే సరైనది, మనకి అన్నీ తెలుసు అన్నభావన పక్కకి పెట్టి పిల్లల మనసు లోని మాట తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వారి అభిరుచికి తగిన రంగంలో వారిని ప్రోత్సహించడం, భయం లేకుండా మనతో అన్ని విషయాలూ చర్చించగలిగే వాతావరణం కల్పించడం, ముఖ్యంగా వారు ఓడిపోయి, అలసిపోయినప్పుడు మేమున్నామన్న ధీమా ఇవ్వగలగడం  తల్లిదండ్రుల బాధ్యత. తరాల మధ్య ఉండే 99 శాతం ఒరిపిడులూ, భేదాభిప్రాయాలూ పరస్పరగౌరవం, అవగాహనా లేకపోవడం అనిపిస్తుంది.  మనం వారికి ఉదాహరణగా నిలవగలిగతే వారికి మనమీద గురికుదిరి మన మాట అర్ధంచేసుకో గలరు.  కార్యాలయాలలో ఉన్నతాధికారులు తమ హోదా, అనుభవాలను ప్రదర్శించి తమమాట నెగ్గించుకోవాలని అనుకుంటే, కుర్రవాళ్లు తమ కున్న ఆధునిక పరిజ్ఞానం, ఉత్సాహం, శక్తి యుక్తులని వాడి సంస్థలో ఎదగాలనుకుంటారు. వారిద్దరూ తమసామర్ధ్యాలను సమీకరించుకుని కలిసి పనిచేయగలిగితే సంస్థ ఎంత ముందుకు వెళ్తుందో కదా.  కుటుంబం, సమాజం కూడా అంతే.

కేవలం భౌతికఅవసరాలు తీర్చడమే కాక, వారి ఆత్మవికాసానికి కూడా దోహదం చేయడం మన కర్తవ్యం. వారి జీవితాలను వారే నిర్దేశించుకోవాలి. మనం కేవలం వారు పూర్ణప్రజ్ఞావంతులై, సంపూర్ణ మానవులుగా ఎదిగడంలో మనపాత్ర వహించగలం. మనకి ఈక్రమంలో కావల్సినది కేవలం అవగాహన.  తరాలఅంతరాలని అధిగమింపచేయగలది అది మాత్రమే.

No comments:

Post a Comment

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.