Thursday, October 02, 2008

మినీ గడి

ఈనెల గడి ఇంకా రాలేదని కొందరు నిరుత్సాహపడడం గమనించి ఓ మినీ గడి తయారు చేసా. కేవలం బ్లాగు నామాల తో పూరించాల్సిన గడి. కూడళ్ళ జోలికి పోకుండా పూరించడానికి ప్రయత్నించండి. సరియైన సమాధానాలని 29 తో భాగించి వందతో గుణిస్తే వచ్చే సంఖ్య మీ తె.బి.క్యూ. (B.Q.) – Telugu Blog Quotient. మీరు సమాధానాలు పంపండి- తెబీక్యూ నేను చెప్తా. ఈగడిలో కేవలం కొన్ని బ్లాగుల పేర్లనే వాడా. ఇది కేవలం సౌకర్యం కోసమే కానీ బ్లాగుల ప్రతిష్ఠ, వాసి, రాసులతో సంబంధం లేదని మనవి చేసుకుంటున్నా. సాధ్యమైనంతవరకూ ఒళ్ళుదగ్గర పెట్టుకునే ఆధారాలు రాసా- మరీ చప్పగా ఉంటుందని కొద్దిగా పెప్పరేసా, అయినా ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియజేస్తే తొలగిస్తా. ఈమధ్యకాలంలో జనాల మనోభావాలు తెగదెబ్బతింటున్నాయి కదా. మా చింతలబస్తీలో మొన్న మనోభావాలు దెబ్బతిని కొట్టుకున్నారట కూడా!

ఈ గడిని పొద్దుకు కూడా పంపిస్తున్నా. అక్కడ ఇమడగలిగితే, వారు ప్రచురిస్తారు. అక్కడే మీరు పూరించచ్చు. మినీగడి వర్డు ఫైలు ఈస్నిప్సు డాట్ కాం లో పెట్టా. దింపండి, నింపండి, పంపండి. మీ సౌకర్యార్ధం సోమవారం పొద్దులో వస్తుంది


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27


ఆధారాలు - అడ్డం
1. వేడివేడిగా పదునుగా ఎండగట్టే బ్లాగు
3. సేదతీరుదామని ఈబ్లాగుకొస్తే -రోజుకో టపా గారంటీ కానీ - వేడీ, వాదం తప్పవు- సీతారాములెలా ఉండేవారో పాపం
5. కందం తెలిసిన బ్యూటిఫుల్ బ్లాగు
7. తెలుగు వెనక్కి తూలితే ... ఈచుట్టుపక్కలంతా తెలుగే తెలుగు
8. బ్లాగరే మనిషైతే .. బ్లాగు జంతువవదుకదా
9. శబ్దం. కానీ కృష్ణుడూదేది - ఐదులో పుట్టినది -సముద్రం లోదొరికేది ముందు కలిపితే బ్లాగు పేరు.
10. నిజం బ్లాగు అబద్ధాలు చెప్తోందని నిజాలు చెప్పడానికి ఈబ్లాగు వచ్చింది. నిజాలూ, అబద్ధాలూ కలిసే పోయాయి.
11. ' - - ' లోకానికి స్వాగతం చెప్పే బ్లాగు
12. ఈవిడ మాది అనిచెప్పేది మాదికూడానూ.. అక్కడ ఎక్కడ చూసినా వరే.
14. స్కిల్
16. పేరులో హస్కింగు - టపాల్లో పౌండింగు
18. శాస్త్రిని కాదని ఆయన ఇంటి పేరును వాడుకున్న బ్లాగు
19. ఇన్మై దిల్లని చెప్పే నాన్-టేక్కీల హృదయానికి కూడా హత్తుకునే బ్లాగు - ఒకేపేరుతో రెండు బ్లాగులున్నాయి - ఒకటి 3-డాట్, ఇంకోటి 5-డాట్ బ్లాగు - అవునూ, ఇంతకీ - దిల్మేనా?
21. లెక్కల్లో పూరేమో గానీ, హాస్యంలో ఘుమఘుమలాడే మరిగే నీళ్ళలాంటివాడు
23. పుస్తకాలు చదువుతారా బార్బేరియస్ - ఈవిడ బ్లాగు చదివితే పోలే
24. వంటల బ్లాగు గురూ అని గుర్తు చేసే బ్లాగు
26. ఈ జోకులు మనదేశానివేనట - ఇంకో రెండురోజుల్లో విజయదశమి పెట్టుకుని మీతో అబద్ధమా
27. న్యూనిబ్ - ఓల్డ్సిరా - అందుకే ఎడాపెడా రాతలు

ఆధారాలు - నిలువు
1. గుర్రాలతో నడిచేబండి, ఎన్టీఆర్ తెచ్చిన చైతన్యంతో రానాల బండిగా మారింది. నాటి -నేటి విషయాలందించే తెలుగున్న ప్రతిభావంత బ్లాగు
2. తలకిందులైనా తెలుగు తెలుగే - మిత్రుడు తిన్నంగా ఉంటే చాలుగా
4. కవితల మహా బ్లాగు - కిందనించి పైకి - నాల్గో అక్షరం సరియైన ప్లేసే - మేఘసందేశాలు పంపడం తెలియక పోయినా బ్లాగడం తెలిసిన ముగ్ధ మనోహర బ్లాగు.
6. కింద పెట్టినా పైకి రాగలిగేది - బాదరాయణుడి భిక్ష - ఒక పండితుడి బ్లాగు
10. ప్రథమా విభక్తి ప్రత్యయం తో బహువచనం చేయండి - మంచి స్వరభరితమైన బ్లాగొస్తుంది
13. తెలుగు ఆచార్యుల వారి బ్లాగింటి పేరే సాగదీస్తేఎలా..
15. ఆస్సిన్ ఫోటోలనే భ్రాంతి కలిగించి మభ్యపెట్టే శీర్షిక తో టపా రాసిన బ్లాగ్ట్రావెలర్ - అవుడియా కింగు
17. ' do not put all your eggs in the same basket' అని విని తన కూరల్ని వేర్వేరు బుట్టల్లో సర్దిన బ్లాగా ? ఎక్కడ సర్దినా ఈయన కూరల రుచి అనితర సాధ్యం
20. మంచిరుచైన టపాలందించే జ్ఞానమయ బ్లాగు
22. ఈపిల్లాడు తెలుగు గడుగ్గాయి - తికమక పెట్టేస్తాడు - గ్రామర్ నేర్చుకుంటున్నాడట బడాయి- గజడదబల్ని కచటతపలు చేస్తున్నాడు -గోపాళానికి చెప్తే సరి.
25. మునిసిపాలిటీ బండిలో వేస్తారా - ఇంకా నయం. ఇది కథల బ్లాగండీ బాబూ

Sunday, September 28, 2008

ఈఅనంతవిశ్వములో నేనెంతటివాడను

మనభూమి సౌరకుటుంబంలోని ఓ చిన్న గ్రహం. అంతరిక్షంలో అలాంటి సౌరకుటుంబాలు ఎన్నున్నాయో, ఈవిశ్వంలో అలాంటిఅంతరిక్షాలెన్నో? నాకేమో తెలియదు, మీకైనా తెలుసునా? అలాంటి విశ్వంలో మన ఉనికి ఎంత అల్పమో, స్వల్పమో ఎపుడైనా ఆలోచించారా? సుకవి శ్రీ వక్కలంక లక్ష్మీపతిశర్మగారి మస్తిష్కంలో మెరిసిన ఒక ఆలోచన ఫలితం ఇక్కడిచ్చిన ఈలలితగీతం.

నేవిన్నది – శ్రీ మల్లాది సూరిబాబు స్వరంలో
మీరువింటున్నది నా అపస్వరంలో, శృతిలయలకతీతంగా, ఉచ్ఛ్వాసనిశ్వాస సహితంగా,నాకు గుర్తున్న విధంగా

పల్లవి – ఈఅనంతవిశ్వములో నేనెంతటివాడను
అణువునైన అందునా పరమాణువైన అవుదునా

చ 1. పర్వతములముందు నేను పరమాణువునైనకాను
ఉదధిముందు నేనిలచిన ఒకబిందువునైన కాను

చ2. జగదీశుడు నాలో సదా వెలుగుతున్నాడట
సృష్ఠికర్త నేనేనట సృష్టియంత నేనేయట

చ3. నాలోనే ఉన్నవాడు నాకగబడడేమో కాని
ఈదాగుడుమూతలేమి ఈసృష్ఠివిచిత్రమేమి
(ఈటపా కి స్పూర్తి రానారె పాత(ట) టపాః- గడిచేనటే సఖీ ఈరాతిరీ. ఆయనకి నెనర్లు)

Tuesday, September 23, 2008

ముంబై ముచ్చట్లు: తాజా వార్త

ఏంటో ఆర్నెల్లయితే కానీ దేనికీ స్పందించలేక పోతున్నా :)) అందరికీ ఆలస్యంగా అందించే వార్త- నేను ప్రస్తుతం ముంబై మహానగరంలో ఉంటున్నా. హైదరాబాదు నుండి బదిలీ మీద మే నెలలో వచ్చా. కొంతమందికి అబ్దుల్ కలాం మన రాష్ట్రపతిగా ఎన్నికయ్యారన్నంత తాజావార్తయుండచ్చు. 1993 నుండి 2002 వరకూ ఇక్కడే, అందులోనూ ఐదేళ్ళపాటు ప్రస్తుతం ఉన్న క్వార్టర్సులోనే ఉండడం తో కొత్త ఊరొచ్చిన ఫీలింగేం లేదు కానీ తెలుగుదనం మిస్సయ్యే అవకాశం ఉంది. కానీ అదృష్టాల్లోకల్లా గొప్ప అదృష్టం ఎక్కడికెళ్ళినా మన భాష వాళ్ళు దొరకడం. నేనెక్కడికెళ్ళినా ఓతెలుగాయన/ఆవిడ దొరకడం గ్యారంటీ. చివరికి కొరియాలో కూడా ఓతెలుగు కుర్రాడు మాయూనివర్సిటీ లోనే, మా బిల్డింగులోనే ఉండేవాడు. నోరారా .. తెలుగు భాషించు జిహ్వ జిహ్వ అనుకుంటూ .. రెండున్నరేళ్ళు సంతోషంగా మాట్లాడేసుకున్నాం. అసలుకి ఆయన వేరే ఊళ్ళో ఉండేవాడు. నేనెళ్ళే ముందే నాకోసమే అన్నట్లు వాళ్ళ ప్రొఫెసరు తను వి.వి. మారుతూ ఇతన్ని కూడా తీసుకొచ్చేసాడు .. డిగ్రీ మాత్రం పాత వి.వి. నుండే ఇప్పించాడు. అన్నింటికన్నా ఆహ్లాదకరవిషయం నాకు హైదరాబాదు బదిలీ అయినప్పుడు (2002 లో)మాపిల్లలకి స్కూలులోతెలుగు ఇప్పించగలగడంతో వాళ్ళకి చదవడం, రాయడం వచ్చింది. శ్రావ్యయితే ఈమధ్య పొద్దులో కొరియన్ జానపదకధ అనువదించింది (ఆంగ్లంనుంచి). తనని ఆశీర్వదించిన వారందరికీ నా కృతజ్ఞతలు.

ఈమధ్య బ్లాగులు చదవుతున్నా కానీ ఎక్కువ స్పందించడం లేదు - చెప్పాగా స్పందన సమయం ఆర్నెల్లని. అదీకాక, ఈమధ్య అన్నీ సెన్సేషల్ టపాలే వస్తున్నాయి - ఏం వ్యాఖ్య రాసినా చాలా ఓపికుంటేకానీ మనలేని పరిస్థితి - కొండొకచో. టపాలు రాయచ్చుగా అంటారా? అంతరాత్మ ప్రబోధం కూడా అదే. దాని ఫలితమే ఈటపా. వీలైనప్పుడల్లా ముంబై ముచ్చట్లు పంచుకుందాం.
భవదీయుడు
సత్యసాయి

Friday, July 18, 2008

గురుపౌర్ణిమ శుభాకాంక్షలు

(ఈటపాలో మత సంబంధ విషయాలు, ఇతర ఆక్షేపణీయ అంశాలు ఉండచ్చు. చెట్ల ఆకులు ఆకుపచ్చగా ఉండడం లాంటి తీవ్ర విషయాలకి మనోభావాలు దెబ్బతినిపించుకోగల సున్నిత మనస్కులూ, అప్రాచ్యులదే శాస్త్రీయ విజ్ఞానం, ప్రాచ్యుల నమ్మకాలు మూర్ఖత్వం అనుకునే పురోగమనులూ చదవకుంటే మేలు).

ఈరోజు గురుపౌర్ణిమ. చాలా మహత్తరమైన రోజు. మనకి ఎనలేని వేద,భారత, భాగవత, పురాణాది వాంఙ్మయ సంపదనందించిన వ్యాసుడి జన్మదినాన్ని గురుపౌర్ణిమగా జరుపుకుంటున్నాం. అందుకే దీన్ని వ్యాసపౌర్ణిమని కూడా వ్యవహరిస్తున్నాం. మన సాంప్రదాయంలో గురువుకి ఉన్నత స్థానమిచ్చారు. చైనా, కొరియా లాంటి ప్రాచ్య దేశాల్లో కూడా గురువుకి చాలా విలువిస్తారు. ఈనాటికీ కొరియాలో టీచర్స్ డే క్రమం తప్పక చేస్తారు. గురువు నీడని కూడా తాకలేనంత దూరం లో భక్తితో మెలగాలని అక్కడి పాతకాలం నాటి నియమంట. మనదేశంలో సిఖ్ఖులు, సింధీల గురుభక్తి వేరే చెప్పనక్కరలేదు. మహారాష్ట్రీయులు కూడా ఈవిషయంలో ముందే ఉన్నారు.


వ్యాసుడి పరంగా వచ్చినా, ప్రస్తుతం గురుపౌర్ణిమ రోజున దత్తాత్రేయుడినే ఎక్కువ పూజించడం, తర్వాత సమర్ధ సద్గురవు గా పేరొందిన షిర్డీ సాయిని కొలవడం ఆచారమయిపోయింది. ముంబైలో అయితే ఈరోజున వీరి మందిరాలు కిటకిటలాడిపోతాయి. షిర్డీలో సరేసరి. ఈగురుతత్వం, మహిమ తెలియాలంటే గురుచరిత్ర అనే గ్రంధం చదవాలి. ఇది గంగాధర సరస్వతి మొదట వ్రాసారు. తర్వాత వాసుదేవానంద సరస్వతి వ్రాసారు. తెలుగులో కీశే. ఎక్కిరాల భరద్వాజ గారు వ్రాసిన పుస్తకం ప్రాచుర్యం పొందింది.

దత్తాత్రేయుని కలియుగావతారాలైన శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీనృసింహ సరస్వతి స్వాముల(ఈయననే శ్రీగురుడని వ్యవహరిస్తారు) జీవిత చరిత్రే ఈ గురు చరిత్ర. దీనిలో నామధారకుడనే కష్టజీవికీ, సిద్ధుడనే శ్రీగురుభక్తునికీ జరిగిన సంభాషణ ఉంటుంది. . ఇందులో మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు పిఠాపురంలో జన్మించి, తర్వాత సన్యసించి ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కురువపురం వద్ద కొన్నాళ్ళు ఆశ్రమ వాసిగా ఉండి, అవతారం చాలించి శ్రీగురునిగా మహారాష్ట్ర లో కరంజిలో అవతరించాడు. పిఠాపురం వాళ్ళకీవిషయం వాసుదేవానంద సరస్వతి స్వామి 19వ శతాబ్దపు చివరలో ఈఊరెళ్ళి చెప్పేదాకా తెలియదు. మొన్నమొన్నటిదాకా, నాకు తెలిసిన పిఠాపురం వాళ్ళకి కూడా వాళ్ళ ఊరు ఘనత తెలియదు. ఈమధ్య మహారాష్ట్రీయులు, కన్నడిగులూ అక్కడ ట్రస్టూ, వసతీ ఏర్పాటుచేసి, మైసూరు గణపతి సచ్చిదానంద స్వామి ఒక కనువిందు చేసే అందమైన మందిరం కట్టించేదాకా ఈఊరికి పెద్ద గుర్తింపు రాలేదు. ఈమధ్య పిఠాపురం సంస్థానం వారు మల్లాది వంశీయుల నుండి లభించిన శ్రీపాదుల చరిత్ర ప్రకటించారు. దీనిగురించిన టపా తాడేపల్లి వారి బ్లాగులో చూడవచ్చు (600 ఏళ్ళ నాటి తెలుగు పుస్తకం). దీనిలో పిఠాపురవాస్తవ్యులు శ్రీపాదులవారిని, వారి కుటుంబాన్నీ ఎలా ఇక్కట్ల పాలు చేసారో చదవచ్చు. తెలుగువాళ్ళు అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉన్నారన్న మాట. మన వాళ్ళొ ట్టి వెధవాయిలోయనుకుంటూ, బయటివాళ్ళు పొగిడితే వాడు మావాడేనని చంకలు గుద్దుకుంటూ, ఆంధ్రా మిల్టననో, ఆంధ్రా హోమరనో ఓబిరుదిచ్చి వాళ్ళకి స్వంత ప్రతిభలేదని నర్మగర్భంగా ప్రకటించేస్తారు.

ఈగురుచరిత్రలో కధలూ, సందర్భాలూ హిందూ మతపరంగా అనిపించినా, సూక్ష్మంగా చూస్తే వాటిలోని బోధలు దేశ,కాల, మతాదులకి అతీతంగాఅనిపిస్తాయి. మొత్తం గురుచరిత్రంతా తిరగేస్తే ఒకే ఒక్క విషయం కనిపిస్తుంది - గురువుని నమ్మిన వాడు పైకొస్తాడని. దీంట్లో మతలబేమీ లేదు. తెలిసినవాడిని ఆశ్రయించి, తెలుసుకొమ్మని. మీదగ్గరకి ఎవరైనా జూనియరొచ్చి అన్నీ తెలిసినట్లుగా పోజిచ్చి, ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే మీరు నేర్పగలరా? (లేరని భావం). ఏదైనా విద్య తెలిసినవాడి దగ్గరకి పోయి నేర్చుకుంటే, ఆయనకి నేర్చుకోవడానికి పట్టిన సమయంకన్నా తక్కువ సమయంలోనే మనం నేర్చుకోవచ్చు. ఆయన అనుభవం మనకి చాలా ఉపయాగపడుతుంది. కానీ ఆయన మీద విశ్వాసం, నమ్మకం చాలా ముఖ్యం. సంశయాత్మా వినశ్యతి అన్న గీతావాక్యాన్ని మర్చిపోవద్దు. నిప్పుని పట్టుకుంటే కాలుతుందన్న జ్ఞానం, అనుభవంమీద నేర్చుకున్నాయన ద్వారా కాల్చుకోకుండానే నేర్చుకోవచ్చు- ఆయనమీద నమ్మకం ఉంటే. ఈయన చెప్పినది నమ్మచ్చా అని సందేహపడితే చేయి కాల్చుకుని కూడా తెలుసుకోవచ్చు!!!

గురువుని గౌరవించని సమాజం ముందుకి వెళ్ళలేదని నిన్న ఒకాయన చెప్తూ, మన దేశ ప్రస్తుత దుస్థితికిదే కారణమని వాపోయాడు. అవుననే అంటా. గురువుని సరిగా గౌరవించని వాడు, ఆయనని ధిక్కరించేవాడు నష్టపోతాడని గురుచరిత్ర ప్రమాణం. నేను ప్రత్యక్షంగా ఒకే సమయంలో ముగ్గురు పిహెచ్ డీ కుర్రాళ్ళవిషయంలో ఈసూత్రం పనిచేయడం చూసా. గురువుని నమ్మిన వాడు పైకెళ్ళాడు, ఆయన మీద కోపం పెంచుకున్నవాడు నష్టపోయాడు. మొదట్లో అన్నిటికీ ఆయనని విమర్శించి, నాసలహామీద ఆయనమీద కొంతభరోసా పెంచుకున్నవాడు మధ్యేమార్గంగా బాగుపడ్డాడు. దీని వెనకాల పెద్ద మతాలూ, మహిమలూ, మట్టిగడ్డలూ లేవు. వీళ్ళకి వాళ్ళ గైడ్ల మీద ఉన్న అనుకూల, ప్రతికూల భావాలు వాళ్ళు చేసే ప్రతిపనిలోనూ వెన్నంటే ఉండి, గైడు మాటలని, చేతలని, సలహాలనీ వాళ్ళ భావాలని బట్టి సరిగానో, వక్రంగానో గ్రహించి, దాన్ని బట్టే ఫలితాలని పొందారు. ఉదాహరణకి గైడు ఒకపని చెప్తే నమ్మకం ఉన్నాయన తూచాతప్పకుండా చేసేవాడు. అందుకని ఆయనలో ఇంటర్నల్ కాంట్రడిక్షన్ లేదుకాబట్టి పూర్తిగా మనసుని లగ్నం చేసి పనిచేయగలిగేవాడు. నమ్మీనమ్మని ఆయనయితే ఇలాగే ఎందుకు చేయాలి తర్జనభర్జనలు పడి, పని చేసేవాడు. అలాచేస్తే మనసుపూర్తిగా లగ్నంకాదుకదా. చాలా ఎమోషనల్ ఎనర్జీ వేస్టవుతుంది కదా. మూడోఆయన మాగైడుకేమీ రాదు, వాడో దరిద్రుడు అని నా దగ్గరే తిడుతుండేవాడు. అన్నీ వచ్చు, వచ్చని డబ్బాలు కొట్టుకుని పని చేస్తే సరైన రిజల్టు రాక పిహచ్ డీ చాలా ఏళ్ళు పట్టింది. విశేషం ఏమిటంటే ఆయన వేరే లేబ్లో 2 ఏళ్ళు రిసెర్చి చేసాక ఇదేకాంప్లెక్సువల్ల బయటికి రావల్సివచ్చి, వేరే చోట (ఖండాంతరాల్లో) జేరాల్సి వచ్చింది. మొదటాయన 4 ఏళ్ళలో డిగ్రీ తెచ్చుకుని వెంటనే అక్కడే ప్రొఫెసరయ్యాడు, గైడు రికమెండేషనుతో. మూడోఆయన ఇంకా స్ట్రగులవుతున్నాడు. మన జీవితగమనం కేవలం మన ఆలోచనల ప్రతిఫలమే.


గురువంటే ఆరడుగుల మనిషేఅవనక్కరలేదు. అవధూతోపాఖ్యానంలో చెప్పినట్లు, చీమ నుండీ బ్రహ్మం వరకూ -దేనిదగ్గరైనా శిష్యరికం చేయచ్చు. ఈరోజు గురుపౌర్ణిమ సందర్భంగా నాకు ఒక ఉనికిని ప్రసాదించిన వారిని ఒక సారి స్మరించుకున్నా. ఆవిశేషం ....
(సశేషం)

Saturday, April 19, 2008

దురాశ+అసంతృప్తి =?

ఈమధ్య ఓసినిమాలో విన్న వ్యాఖ్యః- మనిషి దురాశా జీవి. దురాశ దుఃఖమునకు చేటు అని చిన్నప్పుడు చదువుకున్నాం. అప్పుడు ఏదో వల్లెవేయడమే కానీ అర్ధం అంత తెలియలేదు. ఇలాంటివి అనుభవం మీదే తెలుస్తాయి- కొంతమందికి మాత్రమే అని వేరే చెప్పఖ్ఖర్లేదనుకుంటా. అయితే అనుభవాలని, పరిశీలనలనీ క్రోడీకరించగా తెలిసినదేమిటంటే మన దురాశ వేరే వాళ్ళ దుఃఖానికి చేటు అని. అలాగే వేరే వాళ్ళ దురాశ మన దుఃఖానికి చేటు. దురాశకి లోనవకుండా మనని మనం కాపాడుకోవడమే కాకుండా, ఇతరుల దురాశకి బలైపోకుండా ఆత్మరక్షణ చేసుకోడం చాలా అవసరం. దురాశ పడేవాళ్ళకి ఓ ఉదాహరణ భాగ్యనగర ఆటో డ్రైవర్లు, ప్లంబర్ల వంటి ఇతర పనివారు. పని చేయకుండా (లేదా అతితక్కువ పని చేసి)అధిక మొత్తం అడగడం వీళ్ళకి పరిపాటి. వాళ్ళడిగినదిచ్చాకా కూడా తీసుకున్న సొమ్ముకి తగిన పని చేయాలని రూలేం లేదు.

పోయిన వారం ఒకరోజు గాత్రి 9 గంటలకి బిర్లామందిర్ దగ్గరి కామత్ హోటల్ దగ్గర టైరుపంక్చరయింది. దగ్గర టూల్ బాక్సులేక వేటకి పోయి నాంపల్లి దగ్గరనుండి ఒక కుర్రాడిని పిలుచుకు వచ్చా. 70 రూపాయలడిగాడు. చేసేది లేక ఓకే అన్నా. దార్లో నాంపల్లిలో ఉన్న కామత్ అనుకున్నా ఇక్కడికి తీసుకొచ్చారు అని నసిగాడు. పనయ్యాక 80 ఇచ్చా. ససేమిరా అన్నాడు. 100 ఇచ్చా. కామత్ అన్నారు ఇక్కడికో తీసుకొచ్చారని నిష్ఠురపడ్డాడు. అందుకే 100 ఇచ్చా అని, వెనక్కి ఆటోలో వెళ్ళినా తనడిగిన దానికన్నా ఎక్కువే ముట్టిందని రకరకాలుగా నచ్చచెప్పా. చివరికి బస్సులో వెళ్తా ఇంకో 5 ఇమ్మన్నాడు. టైరు మార్చడానికి అయ్యే కూలీ ప్రయాణించిన దూరాన్ని బట్టి ఉంటుంది కానీ టైరు మార్చడానికి పడ్డ శ్రమని బట్టి కాదన్నమాట. కన్‌వేయన్సు చార్జెస్ ఎక్ష్ట్రా ప్లీజ్జ్...

నిన్న రాత్రి తాజా భేటీ ఒక ఆటో డ్రైవరుతో. రాత్రి 9 గంటలకి నైట్ టైమయిందని ప్రకటించేసాడు. కాస్త నోరు పారేసుకుని కింద పడ్డా మనదే పైచేయన్నట్లు పదిరూపాయలు ఎక్కువకి ఒప్పుకుని (చచ్చినట్లు)ఇంటికి జేరా. ఇంకా గట్టిగా మాట్లాడితే కేసీఆర్ పద్ధతిలో లక్షల్లో ఛార్జి చేస్తాడేమోనని భయమేసింది. అసలు వీళ్ళబోంట్లని చూసే కేసీఆర్ కి ఈకూలీ ఆలోచన వచ్చిందేమో. ఇంకో అడుగేసి తెలంగాణా వస్తే కూలీ రేట్లు ఈ రేంజిలోనే ఉంటాయని ఆయన వాకృచ్చినా ఆశ్చర్యం లేదు.

దురాశ అనగానే నాకు ఈమధ్య చదివిన చందమామ కథలాంటిది ఒకటి గుర్తొస్తుంది. ఒక జాలరివల్లో ఓరోజు బంగారు చేప పడింది. అతను సంతోషిస్తోంటే ఆచేప తనని వదిలేయమని, అందుకు బదులుగా ఏదైనా ఉపకారం చేస్తానని బతిమాలుతుంది. ఆయన బాలిపడి వదిలేసాడు. ఆనక పెళ్ళాం చేత నానా చివాట్లూ తిని, చివరికి ఆవిడ పోరుకిలొంగి చేపని సంపద కోరుకుంటాడు. సంపదొచ్చాక కొన్నాళ్ళకి జాలరి పెళ్ళానికి అసంతృప్తి కలుగుతుంది. మళ్ళీ మొగుడి బుర్ర తిని చేపని పేద్ద భవనం, తోట వగైరాలు, ఆతర్వాత విడతలో పరిచారకులు, రాచరికపు హంగులు తెప్పించుకుంటుంది. అసంతృప్తి ఆగక సూర్యచంద్రులు తనదగ్గరే ఉండేలా చేపని వరం కోరమని మొగుడ్ని పంపిస్తుంది. పాపం జాలరి చేపకి తన జాలిగాధ వినిపించి బాధపడతాడు. చేప నవ్వి అలాగే చేస్తానని ఓదార్చి పంపేస్తుంది. ఇంటికి వచ్చిన జాలరికి తన పాతగుడిసె లో తన పెళ్ళాం కారాలూ, మిరియాలూ నూరుతూ కన్పిస్తుంది. ఇతన్ని చూడగానే విరుచుకు పడుతుంది. అప్పుడు జాలరికి చేప నవ్వు అర్ధమయ్యి పెళ్ళాంతో,"చేప నీకోరిక తీర్చింది చూడు, మన గుడెసెకప్పు లోంచి పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడూ నీదగ్గరే ఉంటా"రని అంటాడు. కధకాబట్టి దురాశకి పనిష్‌మెంటొచ్చింది. నిజజీవితంలో బాగా టైం పట్టచ్చు.

దురాశకి మాతృకా, సోదరీ అసంతృప్తి. కొందరికి బెస్టు ఫలితం వచ్చినా ఇంకా ఏదో వెలితి. బేరాలాడేవాళ్ళకి ఇది తెలిసేఉంటుంది. ఒకాయన గొడుగుకి చేసిన బేరానికి చిరాకెత్తిన షాపతను ఉత్తినే తీసుకు పొమ్మన్నాడట. దానికా పెద్దమనిషి రెండిస్తావా అన్నాడట. ఆమధ్య ఓకథ చదివా. అందులా ఒక నిత్య అసంతృప్తుడి చొక్కాకి బాల్‌పాయింటు పెన్ను ఇంకు అంటుకుంది. తర్వాతి రోజు జరగబోయే ఇంటర్వ్యూకి ఆఅచ్చొచ్చిన చొక్కా వేసుకోవాలని తెగ గొడవ చేసి అందరి బుర్రలూ తింటాడు,. అతని బావగారు తనకితెలిసిన డ్రైక్లీనరు ఆఇంకు మరక పోగొట్టగలడని చెప్తాడు. దానికి ఆ ని.అ.డ్రైక్లీనర్ల అసమర్ధత గురించి, బాల్‌పాయింటు ఇంకు కున్న బంకతనం గురించీ తెగ నిస్పృహ పడిపోతాడు. బావమరిదిని ఉత్సాహపరచాలని, ఆబావగారు తనకి తెలిసిన డ్రైక్లీనరి ప్రతిభని తెగపొగుడుతాడు. ఎలాగైనా బావమరిదిని ఒప్పించి, మెప్పించాలని, అతన్ని సంతృప్తి పరచాలని గాఠ్ఠిగా అనుకుని ఆషర్టుని డ్రైక్లీనరుకిచ్చి, తన పరిస్థితి విన్నవించి ఆచొక్కాని ఉతికించితెస్తాడు. మరక పోయింది అని గర్వంగా బావమరిదికి చూపిస్తే ఆ ని.అ. "చూడండి బావగారూ, ఈమధ్య బాల్‌పాయింటు ఇంకు ఎంత నాసిగా చేస్తున్నారో" అని వాపోయాడు. :)!!??

దురాశ+అసంతృప్తి =అశాంతి(తనకి+చుట్టుపక్కలవారికీ)

Monday, April 07, 2008

ఉగాది శుభాకాంక్షలు

సర్వధారి నామ సంవత్సరం మీఅందరికీ సంతోషాన్నీ, ఆరోగ్యాన్నీ, సంపదల్నీ, బ్లాగులు రాసే బుద్ధినీ, బ్లాగ్వృద్ధినీ ఇవ్వాలనీ నా బ్లాగ్ముఖంగా కోరుకుంటున్నా.
ఈఉగాది తెలుగు బ్లాగరులకి మరిచిపోలేని రోజు. ఒక యుగాది. ప్రవీణ్ ధృఢసంకల్పంతో, దీక్షగా తెలుగుబ్లాగులని ఒక సంకలనంగా తీసుకురావడం తెబ్లా చరిత్రలో ఒక మైలురాయి. రావు గారూ- ప్లీజ్.. నోట్ దిస్పాయింటు. వీవెనుడి ముఖపత్ర వీవింగు నిరాడంబరతలో కూడా సౌందర్యం నింపచ్చని తెలిపింది. ఎంపిక చేసిన టపాలని వివిధ శీర్షికల కింద క్రోడీకరించి పుస్తకాన్ని తీర్చిదిద్దిన ప్రవీణుడి ప్రావీణ్యం మెచ్చుకోదగింది. ఆయనకి అభినందనలు. ఈ పుస్తకం ఇక్కడ ఉంది-- తెలుగు బ్లాగుల సంకలనం.
ఈ పుస్తకాన్ని పదిమందికి పంపించిన రామయ్య గారి బ్లాగుకి విజిటర్ల తాకిడి విపరీతంగా పెరిగింది. సోమయ్యగారి బ్లాగులో అనేకమంది సువ్యాఖ్యలు కుమ్మరించారు. దాంతో వాళ్ళు మహాబ్లాగర్లయిపోయారు. ఇదంతా ట్రాషని కొట్టిపాడేసిన దానయ్యగారి బ్లాగుకి విజిటర్లసలు రాకపోవడంవల్ల విలపిస్తోనే ఉన్నారు. అందుకని మీరు వెంటనే ఓపది మంది తెలుగువాళ్ళకి ఈపుస్తకాన్ని కాని, దాని లింకునికానీ పంపించి మహా బ్లాగర్లయిపోండి.

Thursday, March 27, 2008

తిరు వైరాగ్యం

తొలికాన్పప్పుడు నొప్పులు పడే అమ్మాయికీ, ఆమెభర్తకీ కూడా, 'అయింది చాలు, ఇంకో బిడ్డ ఊసే తలపెట్టద్దు' అనిపిస్తుంది. చాలా ధృఢంగా అనుకుంటారు. ఓఏడాది తిరిగే లోపు మళ్ళీ ఇంకో పిల్లో, పిల్లాడో తయారు. ఇది ప్రసూతివైరాగ్యం.

ఎవరైనా పోయినప్పుడు, 'ఛీ ఎంత స్వల్పంఈప్రాణం, బుడగలాంటిజీవితం' వగైరా ఆలోచనలు వస్తాయి. స్మశానంకి పోతే ఇంక వేరే చెప్పఖ్ఖర్లేదు. అక్కడ ఉన్నంత సేపు మనలో కలిగే వైరాగ్య భావనలు లెక్కలేనన్ని. ఇంటికొచ్చి స్నానం చేయగానే అవన్నీ నీళ్ళతో కొట్టుకుపోవడం తథ్యం. దీన్ని స్మశానవైరాగ్యం అంటారు.

తిరుపతి పోయినప్పుడు, అక్కడ మకాం కోసం, దర్శనం కోసం, అర్చన లేదా సేవ టిక్కెట్ కోసం చేయాల్సిన సర్కస్ విన్యాసాలు, వీఐపిల ఉత్తరాలు సంపాదించి ప్రత్యేక (ప్ర)దర్శనాలు చేయడంకోసం కేంపాఫీసులు, ఎమ్బీసీ 26, ఏటీసీ115, విజయాబ్యాంకు కౌంటర్ల చుట్టూ చేసే గానుగెద్దు ప్రదక్షిణాలు, ఇవన్నీ చేసి ఆనక విజయోత్సాహంతో పొంగిపోవడం లేదా ఆశాభంగంతో క్రుంగిపోవడం మనలో చాలామందికి అనుభవమే. తీరా దర్శనం క్యూలో నుంచుని కాసేపు నత్తలా, కాసేపు పాములా, మరికాసేపు వానపాములా, ఎక్కువ సేపు అచలంగా - చివరికి గర్భగుడిదాకా చేరతాం. ఈలోపు నదిలో ఉపనదులు కలిసినట్లు రకరకాల క్యూలు అక్కడక్కడ కలుస్తూంటాయి. గర్భగుడి దగ్గర సర్వదర్శనం క్యూకూడాకలవడం, అప్పటిదాకా విసిగి ఉన్న జనాలు ఒక్కసారిగా విరగబడ్డం సాధారణం. మళ్లీ బయటికి ప్రాణాలతో రాగలమా అన్న లెవెల్లో లోపల తొక్కిసలాటలు, కుమ్ములాటలు, తోపుళ్ళు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడాలు, వీటి మధ్యలో ఒక క్షణం పాటు ఆశ్రీనివాసుడి దర్శనం,ఆఆనందం ఆస్వాదించేలోపే అక్కడి వాలంటీర్లు చేయి చేసుకోవడంతో మన యాత్ర దాదాపు ముగుస్తుంది. ఇన్ని అనుభవాల తర్వాత ప్రతిసారీ ఇంకెప్పడూ తిరుపతి గాకూడదని గాఠ్ఠి నిర్ణయం తీసుకోవడం, మళ్ళీ ఆబుద్ధి బుధవారంలోపే మారిపోయి తిరుపతికి రిజర్వేషన్ చేసుకోవడానికి సిధ్ధపడి పోవడం మామూలే. ఇది తిరు వైరాగ్యం.

నాకైతే దర్శనంతర్వాత ప్రసాదంగా ఇచ్చే దద్దోజనమో, పొంగలో బలే రుచిగా అనిపిస్తుంది. అప్పటిదాకా మనకి కలిగిన ఇబ్బందులకి శ్రీనివాసుడు మనకి ఓదార్పుగా ఇచ్చే తాయిలంలా అనిపిస్తుంది. అందుకేనేమో నేను ఆప్రసాదం కోసం ఆత్రంగా ఎదురుచూస్తా.

కొసమెరుపు

జంటిల్ మ్యాను అనే సాక్షి వ్యాసంలో పానుగంటివారు ఒక రాజుగారిని దర్శించుకోవడానికి పిల్లల కోసం ఆటవస్తువులు, బొమ్మలు అమ్ముకొనే వ్యక్తి తనని తాను 'Well, I am a Gentleman' అని పరిచయం చేసుకోవడంతో తెల్లబోయిన వ్యాఖ్యాత ద్వారా కొన్ని వ్యాఖ్యలు చేయిస్తాడు. చదవండి....
"మీరెవ్వరనగ నేను పరమహంసనని చెప్పుకొనినవాడున్నాడు. [బ్లాగరునని చెప్పుకొనువాడున్నాడు :)))]. ..... నేను సంధానకర్తనని చెప్పుకొనువాడున్నాడు. కాని నేను Gentleman అని చెప్పుకొనువారినెవ్వరిని నిదివరకు చూడలేదు. .....జగత్తులో Gentleman యెంత చవుకయైపోయినారు. జట్కాబండి యెక్కినవాడెల్ల జంటిలుమనే. సిగరెట్లు నోటబెట్టినవాడెల్ల జెంటిల్ మనే. .....అటులైన నింక పెద్దమనుష్యులకు ప్రపంచమున లోపమేమున్నది? పశువుల సంతలలో పెద్దమనుషులు, భోగమువీధులలో పెద్దమనుషులు, కల్లుపాకలలో పెద్దమనుషులు, కన్నకాండ్రలో పెద్దమనుషులు,నెత్తికోతలవాండ్రలో పెద్దమనుషులు- ఇంక భూలోకమే వైకుంఠము." (కవిశేఖర పానుగంటి లక్ష్మీనరసింహారావు,సాక్షి,రెండవ భాగం, అభినందన పబ్లిషర్సు, విజయవాడ, పు.237)

దేశంలో, ముఖ్యంగా రాష్ట్రంలో, ఎంతమంది వీఐపిలున్నారో లెక్క తెలియాలంటే తిరుపతిలో సర్వే చేస్తే సరిపోతుంది. ఎంతమంది వీఐపి ఉత్తరాలతో అక్కడ గుమిగూడతారో! నాకు తిరుపతివెళ్ళిన ప్పుడల్లా వీళ్ళని చూడగానే సాక్షి జంటిలుమనులే గుర్తొస్తారు. అన్నట్లు నేను కూడా జంటిల్ మను లాగా మెన్ననే తిరుపతెళ్ళి వచ్చా.

Wednesday, February 20, 2008

ఈమధ్య నాకు బాగా తెలుగు చేసింది

ఇదేంటి తెలుగు చేయడమేంటి అనుకుంటున్నారా? ఈ మధ్య జలుబు చేసినట్లే తెలుగు చేసింది. జలుబు లక్షణాలు మనందరికీ తెలుసు. ముక్కులోంచి నీరుకారడం, తుమ్ములు... ఇలాంటివి. కానీ తెలుగు చేస్తే వ్యాధి లక్షణాలు మనని కలిసిన వాళ్ళలో కనిపిస్తాయి. వ్యాధి లక్షణాల తీవ్రత ఆయా వ్యక్తులు మనతో ఎంతసేపు మాట్లాడారు, ఎంత మొహమాటస్తులు అనే వాటికి అనులోమానుపాతంలో ఉంటుంది. అలాగే వారికీ మనకీ ఉన్న సంబంధబాంధవ్యాలని బట్టి కూడా ఉంటుంది. ఉదాహరణకి మనం వాళ్ళకి అప్పున్నా లేక వాళ్ళు మనకి అప్పున్నా వాళ్ళు మన మాటని అంత నిష్కర్షగా తోసిపాడేయలేరు. అయినా నాపిచ్చిగానీ ఈమధ్య ఎవరూ ఎవరిదగ్గరా అప్పులు ఇచ్చిపుచ్చుకోవట్లేదు. ఏవన్నాఅవసరపడితే బ్యాంకుల్లోనో, అప్పుచీటీ (క్రెడిట్ కార్డు) ఉపయోగించో డబ్బులు తీసుకోవడం పరిపాటైపోయింది. ఈ పద్ధతిలో అయితే అప్పు ఎగ్గొట్టే సౌకర్యంకూడా ఉంది కదా.

కానీ వ్యాధి దశ, కారకాన్ని బట్టి మనలో కూడా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి లక్షణాలలో కొన్నిఏమిటంటే - 1) ఎవరైనా పెల్లి, మల్లీ, బర్త, బార్య ఇలా వత్తుల్లేకుండా మాట్లాడుతుంటే కడుపులో కెలికినట్లుండడం, ఎక్కడో కాలినట్లు మండడం, 2) కూడలిలో తప్పిపోయి ముఖ్యమైన తేదీలని, పనులని మర్చిపోవడం, 3) ఏం చేసినా, రాసినా తెలుగులో చేయాలనిపించడం, 4) పిల్లలని తెలుగులో చదువు, రాయి అని సతాయించి వాళ్లు అలాచేయకపోతే ఎసిడిటీ తెచ్చుకోవడం, 5) బ్లాగులో టపా రాసేయగానే హిట్లు లెక్కెట్టుకోవడం, ఉండొచ్చు. ఇతర రకాలైన లక్షణాలు కూడా కనిపించే అవకాశం లేకపోలేదు.

ఇంతకీ నాకు తెలుగు చేయడం విషయానికొస్తే, ఆఫీస్ ఎవరైనా నా సీటుకొస్తే మటాష్. ఏదో అడుగుతారు, సంభాషణ ఎటునుంచి ఎటో పోయి చివరికి తెలుగు దగ్గరకి వస్తుంది. వెంటనే ఆవు వ్యాసం మూసలో నా ధోరణిలోకి వచ్చేసి తెలుగుభాష, ఇంటర్నెట్ లో తెలుగు, గూగుల్లో తెలుగు, కంప్యూటర్ నిపుణులు, ఔత్సాహికులు ఇంటర్నెట్ లో తెలుగుని ఎంతగా వ్యాప్తి చేస్తున్నారు, కూడలి, కంప్యూటర్ లో తెలుగు రాయడం వంటి విషయాల విషయాలపై సైద్ధాంతిక చర్చ, ఆవెంటనే ఓ డెమో చకచక జరిగపోతాయి. మొత్తానికి ఓ ఇన్సూరెన్స్ ఏజెంటు లాగా అయిపోయా. ఈమధ్య ఇంటర్నెట్టులో తెలుగు వెలుగులు అని వ్యాసంవచ్చిన ఈనాడు ఆదివారం పుస్తకం నాబ్యాగులో ముఖ్యభాగం అయిపోయింది అని వేరే చెప్పఖ్ఖర్లేదనుకుంటా. ఆమధ్య నాదగ్గరకి ఒక కుర్రాడొచ్చాడు. సంగీతం నేర్చకున్నాడట, సంస్కృతంలో రిసెర్చ్ చేస్తున్నాడట. పాపం తను వేరే పని మీదొస్తే, అది అవ్వదని ఒక్కముక్కలో తేల్చేసి ఓ అరగంట తెలుగుగురించీ, బ్లాగులగురించీ అతనుబ్లాగు చేయాల్సిన అవసరం గురించీ నొక్కి వక్కాణించేసా. పైగా మీరేదో పని మీదొస్తే మీ టైం తినేస్తున్నానా అని సన్నాయినొక్కులు కూడా నొక్కా. మా అన్నయ్య కూతురు తన చిన్నప్పుడు (3 ఏళ్ళ లోపు వయస్సులో) ఎడతెరిపిలేకుండా బాగా కబుర్లు చెప్పేది. ఒకసారి అలాంటి ఘట్టంలో బాబయ్యా, నేనిలా మాట్లాడుతుంటే నీకు నోరునొప్పెడుతోందా (తల నెప్పెడుతోందా అని భావం) అని అడిగింది. నేను పైన చెప్పినట్లుగా సన్నాయినొక్కులు నొక్కుతున్నప్పుడు ఆఅమ్మాయి డైలాగే గుర్తొచ్చి నవ్వొస్తుంది.

నాకు తెలుగు పట్టిన లక్షణాలు మీలో పొడచూపక ముందే ఓ రెండు ముక్కలు చెప్పిముగిస్తా. రెండు ముక్కలంటే మా చిన్నప్పటి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాలు గుర్తొస్తాడు. ఆయన ఉపన్యాస ప్రియుడు. అన్ని సభల్లోనూ ఆయన మాట్లాడవలసినదే. పాపం ఆయన ఎప్పుడూ రెండుముక్కలు చెప్పి ముగిస్తా అని మొదలెట్టి మధ్యమధ్యలో ఆమాటకి పునరంకితమవుతూ అవుతూ ఓగంట పైగా మాట్లాడి మాబుర్రకాయల్ని వేయి ముక్కలు చేసేవాడు. నేనలా చెయనని నా హామీ.

మొదటిముక్క. ఈమధ్య వెనుకబడిన జిల్లాలకి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోమని పంచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ కొన్ని నిధులిచ్చింది. సాయం చేయమని కొన్ని జిల్లాలబాధ్యత మాకప్పగించింది. అలాంటి జిల్లాల్లో కరీంనగరొకటి. ఈమధ్య జరిగిన సమావేశంలో నేనొక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (తెలుగులో ఏమంటారో) తెలుగులో తయారు చేసా. ఎవరైనా సరదా పడితే ఈక్రింది లంకె ద్వారా చూడొచ్చు.
సహస్రాబ్ది లక్ష్యాల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా ప్రణాళిక
బలే సంతృప్తిగా అనిపించింది. చివర ధేంక్స్ స్లైడులో నెనర్లు అని రాసా. అంటే ఏంటని అడిగిన మా సారుకి దానర్ధంచెప్పి బోలెడానందపడిపోయా.

రెండో ముక్క. మాఅమ్మాయి చిన్నప్పుడు తనని పడుకోబెట్టడానికి తెలుగు పద్యాలూ, పాటలూ రాత్రి పూట రోజూ పాడుతోంటే తనకి అలవాటైపోయాయి. ఆవయసులో వచ్చే బాబా బ్లేక్షిప్పులూ, జింగిల్ బెల్లులూ నేర్పించలా (నాకు రావు కదా- మాదంతా ఉప్పుకప్పురం, వంకరటింకర ఓ చదువులాయే). చివరాఖరుకి నాన్నా అని తప్పించి డాడీ అని కూడా పిలిపించుకోలేకపోయా. హైదరాబాదు మాఅత్తగారింట్లో పనిపిల్ల కొడుకు వాడి అమ్మా నాన్నల్ని మమ్మీ డాడీ అని పిలుస్తోంటే కాస్త చిన్నతనం ఫీలవ్వాల్సిందేమో, అదికూడా చేతకాలే. ఆనక హైదరాబాదు వచ్చాకా మాపిల్లలు తెలుగు రాయను చదువనూ నేర్చుకున్నారు. పైన చెప్పిన ఏసందర్భాల్లోనూ కలగని ఆనందం మా పిల్లలు మాగంటి.ఆర్గ్ వారి పిలుపు మేరకి, నా అభ్యర్ధన మన్నించి తెలుగులో చెరియొక వ్యాసం రాసి ఆయనకి పంపించడం, దాన్ని వారి వెబ్ పుటలో చూసుకోవడం ద్వారా కలిగింది. ఇకముందు కూడా వాళ్ళు తాము నేర్చుకున్న తెలుగును మర్చి పోకుండా, తృణీకరించకుండా ఉండాలని ఆశిస్తున్నా.
కొసరు మాట- తెలుగు వ్యాధికి మందు వాలైనంత మందికి దాన్ని అంటగట్టడమేనేమో!!! :)))

Sunday, February 10, 2008

ఏ నరునకు విత్తముగల దానరుడు....

ఈ టపా ఎప్పుడో మొదలు పెట్టా. ఈలోపే వేరే బ్లాగర్ అదే విషయం మీద రాయడం వల్ల పెట్టెలో పెట్టా. ఈవేళ ఓ టీవీ ప్రకటన వినగానే మీఅందరితో నా ఆనందం (??) పంచుకోవాలనిపించి రాసినదీ టపా. ఏంటీ టీవీ సంభాషణల్లా నాన్పుడేమిటీ అంటారా? ఈవార్త టీవీకి సంబంధించిందే.

ఆల్రౌండరు సుమన్ ఓసీరియల్లో ఒక విలక్షణమైన అతిధి పాత్రలో నటించబోతున్నారట.

ఆయన ఇప్పటికే ఒక టెలీసీరియల్లో కృష్ణుడిగా నటించి సంచలనం సృష్టించాడని కూడా సదరు ప్రకటనల్లో హోరెత్తించేసారు. మీరు ఈప్రకటన ఇప్పటిదాకా వినక పోతే నిరాశపడకండి. ఈటీవీలో కార్యక్రమాలని ఈప్రకటనకి షార్ట్ బ్రేకులుగా వేస్తున్నారు. మిస్సయ్యే ఛాన్సు లేదు.

ఈయన గురించి ఆంధ్రదేశంలో తెలియని వారుండరు. ఈయనకి లేని కళ లేదు. ఆయన సీరియళ్ళలో ఈయన పేరు పైన అన్నీ ఉండేవి- రచన, బొమ్మలు, పాటలు, మాటలు, దర్శకత్వం, సంగీత దర్శకత్వం ....వగైరాలు. ఇప్పుడు నటన కూడా కలుస్తుంది. ఆనక ప్రేక్షకుడు అని కూడా కలిసి ఆయన ప్రతిభ ఆయనే చూసుకుని మురిసిపోయే రోజొస్తుందని దీవిద్దాం.

సుమన్ ఒక సంచలనం (sic). హీ ఈజే ఫినామినాన్. కాకపోతే ఆయనమీద ఇంతమంది బ్లాగర్లు టపాలు రాసేంత స్పూర్తి పొందగలరా? ఈమధ్య వచ్చిన చావా కవితలో మీ బ్లాగునకు మీరే సు మన్! ఆయన పేరు ప్రతిధ్వనించింది.

అభిరామ్ .. అంతా సుమన్ మయం…

సోది - ఓ జోకు ఈటీవీ-సుమన్ నందు ఓ ప్రకటన

నాలోనేను - విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, నట సామ్రాట్, నట రత్న(మెగా స్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్, రెబెల్ స్టార్, రైజింగ్ స్టార్, ఆ స్టార్, ఈ స్టార్..!) సుమన్

చదువరి - నా గోడు

ఇవి కొన్ని మచ్చు తునకలు.

మీకో అనుమానం రావచ్చు- పేరొందిన వారందరూ కాస్తో కూస్తో చిన్న వయసునుండీ ప్రతిభ చూపించుకున్న వాళ్లే. అకస్మాత్తుగా బహుముఖ ప్రజ్ఞావంతులయిపోవడం అరుదు. కానీ దీనికి సమాధానం భర్తృహరి తన అర్ధ పద్ధతి లో ఎప్పుడో సెలవిచ్చాడు.

యస్యాస్తి విత్తం స నరః కులీన స పణ్డితస్య శృతవాన్ గుణఙ్ఞః స

ఏవ వక్తా స చ దర్శనీయః సర్వేగుణాః కాఞ్చనమాశ్రయన్తి

దీనిని తెలుగులో ఏనుగు లక్ష్మణకవి ఇలా చెప్పాడు.

ఏ నరునకు విత్తముగల
దానరుడు కులీనుడధికుడార్యుడతండే
ధీనిధి ధన్యుడు నేర్పరి
నానాగుణగణము కాంచనంబున నిలుచున్

తాత్పర్యం:
ఎవరికి ధనముగలదో వాడే గొప్పకులమువాడు, గొప్పవాడు, బుద్ధిశాలి, కృతార్థుడు, నిపుణుడు కాన అన్ని గుణములును బంగారము (డబ్బు అనచ్చు) నందే నిలచియున్నవి.

ఏంటీ కాళిదాసు సడెన్గా మహాకవయిపోలేదా అంటారా?

అలా అయితే ఓకే.

Thursday, December 06, 2007

కేవలం యాదృచ్ఛికం అనలేని ఘటనలు

నా కూతురి (బ్లాగు) మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించిన వారందరికీ నాకృతజ్ఞతలు - జ్యోతక్క 'దీవెన'లకి ప్రత్యేకంగా. అవడానికి 54 టపాలున్నా 10 ముసాయిదాలుగానే ఉండిపోయాయి. ఇక్కడో గమ్మత్తు జరిగింది. నవంబరు 2006 (20 కి నాకు 44 నిండాయి- ఈరోజుల్లో మగాడి వయస్సు, ఆడవాళ్ళ జీతం అడగ కూడదని శాస్త్రం- అయినా నా వయస్సు చెప్పేసా) లో మొదలెట్టిన బ్లాగు లో నవంబరు 2007 నాటికి అనుకోకుండా, నాప్రమేయం లేకుండా నావయసుకి సమానంగా టపాలు వచ్చాయి.


ఇలా అప్పుడప్పుడు తేదీలకి మన జీవితంలో కొన్ని ఘటనలకి అనుకోకుండా లంకె కుదరడం కేవలం యాదృచ్ఛికం అనుకోలేం. అలాంటి ఒక లంకె మానాన్నగారి జీవితంలోని ముఖ్య తేదీలకి మాముగ్గురి అన్నదమ్ముల జన్మదినాలకీ ఉండడం నాకెప్పుడూ విచిత్రంగా తోస్తుంది. మానాన్నగారి పుట్టిన రోజునాడే ఆయన పెద్దకొడుకు (అంటే మా అన్నయ్య) పుట్టాడు. మా తమ్ముడి పుట్టిన రోజునాడు ఆయన పోవడం, నా పుట్టిన రోజు నాడే ఆయనకి కొద్ది రోజులే మిగిలున్నాయని వైద్యులు ధృవీకరించడం ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇదిలా ఉంచితే, ఓ వారం క్రితం ఓకలొచ్చింది. అందులో ఒక సాధువు నన్ను ప్రవచనం ఇవ్వమన్నాడు. నేను శక్తి అన్నవిషయం మీద మాట్లాడా. అంతా అయిపోయాక అయ్యో .. శక్తి నిత్యత్వ సూత్రం (శక్తి సృష్టించబడదు, నశించదు, కేవలం ఒక రూపం నుండి వేరొక రూపం లోకి మారగలదు) గురించి చెప్పడం మరచానే అనుకుంటుంటే మా ఆవిడ లేపడం వల్లననుకుంటా కల చెదిరిపోయింది. మర్నాడు ఆఫీసులో హలో మాత్రపు పరిచయం ఉన్నాయన లంచి టైం లోకలిసాడు. ఆ వేళ పొద్దున్నే మా స్నేహితులిద్దరు ఆయన సదా ఆనందంగా ఉండగలడని చెప్పిన విషయం ఆయనకి చెప్పా. ఆమీదట ఆయన ఆవిషయం మీద ఏదో చెబుతూ అలా అలా మాట్లాడుతూ చివరికి శక్తి నిత్యత్వ సూత్రం గురించి చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈలోగా మా లంచిమితృడొచ్చి నన్నక్కడినుంచి లాక్కు పోయాడు (కలలో మాఆవిడ అంతరాయం కలిగించినట్లే). మరుసటి రోజు వెళ్ళి ఆయనకి నాకల గురించి చెప్పా.

ఆయన తో నాకు కలిగిన ఇలాంటిదే ఇంకో అనుభవం కూడా చెప్పా. అది నేను ఢిల్లీలోని AIIMS కి మా నాన్న గారి మెడికల్ బిల్ ( ఆయన అక్క డ కొన్నాళ్ళు వైద్యం చేయించుకున్నారు) మీద సంతకం కోసం వెళ్ళినప్పుడు జరిగింది. ఆఫీసులో బిల్లిస్తే ఓగంట కూర్చోపెట్టి ప్రతి బిల్లుమీదా సూపర్నెంటు సంతకాలు పెట్టించి ఇచ్చారు. తీరా ఇంటికొచ్చాకా చూస్తే కూడిక తప్పైందని తెలిసింది. వామ్మో అని ఓరెండుమూడు రోజులు కూడిక తప్పు కాకుంటే బాగుండునన్న అత్యాశతో మళ్ళీ మళ్లీ కూడి ఒకరిద్దరితో కూడించి ఇంక లాభంలేదని చెప్పి మళ్ళీ వెళ్ళక తప్పదన్న నిర్ణయానికి వచ్చా. మళ్ళీ ఇంకెంత ప్రొసీజరో ఏంటోనని కొన్ని రోజులు మధనపడడం ఇంకా గుర్తుంది. అక్కడికి వెళ్దామనుకున్న ముందు రోజు ఓకల. అందులో నేను సూపర్నెంటు ఆఫీసుకు పోయా. అక్కడున్న పంజాబీ ఆంటీ తో నా ముచ్చట ఇలా సాగింది.

నేను - చిరునవ్వు - కీ హాల్ హై (ఎలా ఉన్నారు)
ఆంటీ - ప్రతినవ్వు - క్యా బాత్ హై( విషయం ఏమిటి)

నేను - some problem
ఆంటీ - totalling error

నేను - yes (కాయితాలిచ్చా)
ఆంటీ - తన రిజిస్టర్ లో మొత్తాన్ని సరిచేసి -అక్కడో పొట్టి సంతకం చేసి కాయితాలు వెనక్కిచ్చింది.

నేను - వెయిట్ కరూ (వేచి ఉండనా)
ఆంటీ - నా.. హో గయా ( అక్కర్లేదు .. పని అయిపోయింది)

పని అతి సులభంగా పని అయిపోయింది అని సంతోష పడేలోగా కల కరిగి పోయి ఇంకా వాళ్ళ ఆఫీసుకి వెళ్ళలేదన్న నిజం సాక్షిగా కళ్ళు తెరిచి తయారై AIIMS కెళ్ళా. నమ్మండి ... నమ్మకపోండి మా సంభాషణ ఆసాంతం పై మాదిరిగానే జరిగింది. నా సంభాషణలు నాకు తెలుసు. కానీ ఆంటీ కి తన పోర్షనెలా లీకయిందో తెలియదు.

ఈ అనుభవాలు రెండూ విని ఆయన మన ఆలోచనలు, వాటి తీవ్రతని బట్టి, వేరేవాళ్ళలో సారూప్య ఆలోచనలను కలిగించచ్చని విశ్లేషించాడు. మరి మీరేమంటారో?