Showing posts with label లోకంతీరు. Show all posts
Showing posts with label లోకంతీరు. Show all posts

Saturday, October 03, 2009

సత్యశోధన అవసరమా?

(ఈటపా ఎప్పుడో రాసినది .. అయినా సత్యశోధనకి సమయం మించిపోవడం ఉండదుకదా అని పోస్ఠ్ చేస్తున్నా.)

ఈమధ్యలోఎదుటి మనిషిచేత నిజం చెప్పించాలని ఓ టీవీ కార్యక్రమం కంకణం కట్టుకొంది.  స్టార్ ప్లస్ లో వస్తున్న సచ్ కా సామనా చూసే ఉంటారు.  మా పిల్లలు చెప్తే ఒక ఎపిసోడ్ చూసా.  తర్వాత మరొకటి. ఇందులో 21 ప్రశ్నలకి నిజం చెప్పగలిగితే కోటి రూపాయలు వస్తాయి.

మొదట చూసిన ఎపిసోడ్ లో ఒకావిడని (స్మిత అనుకుంటా) రాజీవ్ ఖండేల్వాలా (పృచ్ఛకుడు) ప్రశ్నలడుగుతూ పోయాడు.  ఆవిడ ఒక స్థాయికి వచ్చేసరికి, ఇబ్బందికరమైన ప్రశ్నలడగడం మొదలెట్టాడు. ఇది ఆయన స్ట్రాటజీ. ఒకస్థాయినుండి ఇంకో దానికి వెళ్ళేముందు షోనుండి వెళ్ళిపోవడానికి అవకాశం ఇస్తారు.  ఇంకా ముందుకెళ్తుందనుకున్నఆవిడని అడిగిన ప్రశ్న.. మీపతికి ఎప్పటికీ తెలియదని మీకు నమ్మకంగా తెలిస్తే మీరు వేరేమగవాడితో పడుకుంటారా? ఆడమగ సంబంధాలలో ఎన్ని రకాల శృతులూ, అపశృతులూ ఉంటాయో అవగాహన ఉన్నా, ఈప్రశ్న అడగడం ఎబ్బెట్టుగా అనిపించింది. దీనికి ఆవిడ నో అన్నా, పోలీగ్రాఫ్ ఒప్పుకోలేదు. అప్పటి ఆవిడ పరిస్థితి ఎంత దుర్భరమో ఊహించండి. అందులోనూ ఆవిడమొగుడు అక్కడే ఉన్నాడు.  

నే చూసిన రెండో ఎపిసోడ్లో పాల్గొన్నాయన చాలా  ఓపెన్గా ఉన్నాడు. తీరా ముందుకు వెళ్తున్న సమయంలో, మీరు విదేశం వెళ్ళినప్పుడు అక్కడ వేశ్య…  అని ప్రశ్న మొదలెట్టగానే వాళ్ళావిడ బజ్జర్ నొక్కి ఆప్రశ్నపట్ల తన వ్యతిరేకత తెలియచెప్పింది (షోలో కూడా వచ్చిన వారికి తమ అభ్యంతరం షోలో ఒక్కసారి చెప్పే అవకాశం ఇస్తారు).   వెంటనే పృచ్ఛకుడు ప్రశ్నమార్చి మీరెప్పుడైనా మీభార్యని మోసం (పరాయసంబంధాలు పెట్టుకోవడం ద్వారా) చేసారా అని  ప్రశ్నించాడు.  దీనికి ఆయన పెళ్ళాం ఎదురుగా  ఏంచెప్పాలో తికమక పడి లేదన్నాడు. పోలీగ్రాఫ్ పరీక్షప్పుడు ఎస్సని ఇప్పుడు నో అనేసరికి ఆమానవుడు షోనుండి వెనుదిరగాల్సొచ్చింది.  తర్వాత అక్కడికక్కడే తన భార్యముందు చాలా ఇబ్బంది పడ్డాడు.

అసలు ఈపోలీగ్రాఫ్ ఏంటయ్యా అంటే మనం సమాధానాలు చెప్పినప్పుడు మన శరీరంలో జరిగే మార్పులని, రక్తపీడనాన్ని బట్టి మనం చెప్తున్నది నిజమా, అబద్ధమా అన్నది నిర్ధారిస్తుంది. అది ఎంత ఖచ్చితంగా నిర్ధారించగలదూ అన్న విషయం పక్కనపెడితే, అసలు ఇంత కష్టపడీ, పెట్టీ  నిజం చెప్పించడం, షోకోసమైనా సరే, అవసరమా? 

అవసరమైనప్పుడు అంటే ప్రాణమానవిత్తభంగములందు అబద్ధమాడచ్చునన్నది ఆర్యవాక్యం. ఇవన్నీ భంగమైనా సరే నిజం చెప్పించడం మాత్రమే మన టీఆర్పీ రేటింగ్‌కి అవసరం అన్నది వ్యాపార సూత్రం అనుకుంటా.

ఎంత అబద్ధాల కోరైనా ఆవిషయం ఒప్పుకోడు. తనంత సత్యసంధుడు ఎవరూ లేరనే అనుకుంటాడు.  సత్యం శివం సుందరం అన్న భావనలో ఇది ఒక కోణం అని ఒకాయన సెలవిచ్చాడు. అలాగే ఎవరినైనా నిజం చెప్పు… నిజం చెప్పని రాపాడిస్తే వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు.  ఇంకా ఘోరం ఏంటంటే నిజంగా నిజం చెప్తున్న వ్యక్తిని నిజం చెప్పు అని నిలదీస్తూ పోవడం. అప్పుడావ్యక్తికి కలిగే మానసిక వేదన అంతా ఇంతా కాదు.   ఇలాంటి సందర్భం మొగుడూ పెళ్ళాల మధ్య వస్తే ఇంక చెప్పక్కరలేదు.

సాధ్యమైనంత వరకూ నిజాయితీగా, సత్యవాదిగా ఉండడం ఆదర్శప్రాయంగానూ, అత్యుత్తమ జీవన విధానంగానూ ఒప్పినా చాలాసందర్భాల్లో, అబద్ధం చెప్తున్నారని తెలిసినా కూడా ఎదుటివారికి ఎంతో కొంత వెసులుబాటు వదలడం విజ్ఞత.

Sunday, February 10, 2008

ఏ నరునకు విత్తముగల దానరుడు....

ఈ టపా ఎప్పుడో మొదలు పెట్టా. ఈలోపే వేరే బ్లాగర్ అదే విషయం మీద రాయడం వల్ల పెట్టెలో పెట్టా. ఈవేళ ఓ టీవీ ప్రకటన వినగానే మీఅందరితో నా ఆనందం (??) పంచుకోవాలనిపించి రాసినదీ టపా. ఏంటీ టీవీ సంభాషణల్లా నాన్పుడేమిటీ అంటారా? ఈవార్త టీవీకి సంబంధించిందే.

ఆల్రౌండరు సుమన్ ఓసీరియల్లో ఒక విలక్షణమైన అతిధి పాత్రలో నటించబోతున్నారట.

ఆయన ఇప్పటికే ఒక టెలీసీరియల్లో కృష్ణుడిగా నటించి సంచలనం సృష్టించాడని కూడా సదరు ప్రకటనల్లో హోరెత్తించేసారు. మీరు ఈప్రకటన ఇప్పటిదాకా వినక పోతే నిరాశపడకండి. ఈటీవీలో కార్యక్రమాలని ఈప్రకటనకి షార్ట్ బ్రేకులుగా వేస్తున్నారు. మిస్సయ్యే ఛాన్సు లేదు.

ఈయన గురించి ఆంధ్రదేశంలో తెలియని వారుండరు. ఈయనకి లేని కళ లేదు. ఆయన సీరియళ్ళలో ఈయన పేరు పైన అన్నీ ఉండేవి- రచన, బొమ్మలు, పాటలు, మాటలు, దర్శకత్వం, సంగీత దర్శకత్వం ....వగైరాలు. ఇప్పుడు నటన కూడా కలుస్తుంది. ఆనక ప్రేక్షకుడు అని కూడా కలిసి ఆయన ప్రతిభ ఆయనే చూసుకుని మురిసిపోయే రోజొస్తుందని దీవిద్దాం.

సుమన్ ఒక సంచలనం (sic). హీ ఈజే ఫినామినాన్. కాకపోతే ఆయనమీద ఇంతమంది బ్లాగర్లు టపాలు రాసేంత స్పూర్తి పొందగలరా? ఈమధ్య వచ్చిన చావా కవితలో మీ బ్లాగునకు మీరే సు మన్! ఆయన పేరు ప్రతిధ్వనించింది.

అభిరామ్ .. అంతా సుమన్ మయం…

సోది - ఓ జోకు ఈటీవీ-సుమన్ నందు ఓ ప్రకటన

నాలోనేను - విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, నట సామ్రాట్, నట రత్న(మెగా స్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్, రెబెల్ స్టార్, రైజింగ్ స్టార్, ఆ స్టార్, ఈ స్టార్..!) సుమన్

చదువరి - నా గోడు

ఇవి కొన్ని మచ్చు తునకలు.

మీకో అనుమానం రావచ్చు- పేరొందిన వారందరూ కాస్తో కూస్తో చిన్న వయసునుండీ ప్రతిభ చూపించుకున్న వాళ్లే. అకస్మాత్తుగా బహుముఖ ప్రజ్ఞావంతులయిపోవడం అరుదు. కానీ దీనికి సమాధానం భర్తృహరి తన అర్ధ పద్ధతి లో ఎప్పుడో సెలవిచ్చాడు.

యస్యాస్తి విత్తం స నరః కులీన స పణ్డితస్య శృతవాన్ గుణఙ్ఞః స

ఏవ వక్తా స చ దర్శనీయః సర్వేగుణాః కాఞ్చనమాశ్రయన్తి

దీనిని తెలుగులో ఏనుగు లక్ష్మణకవి ఇలా చెప్పాడు.

ఏ నరునకు విత్తముగల
దానరుడు కులీనుడధికుడార్యుడతండే
ధీనిధి ధన్యుడు నేర్పరి
నానాగుణగణము కాంచనంబున నిలుచున్

తాత్పర్యం:
ఎవరికి ధనముగలదో వాడే గొప్పకులమువాడు, గొప్పవాడు, బుద్ధిశాలి, కృతార్థుడు, నిపుణుడు కాన అన్ని గుణములును బంగారము (డబ్బు అనచ్చు) నందే నిలచియున్నవి.

ఏంటీ కాళిదాసు సడెన్గా మహాకవయిపోలేదా అంటారా?

అలా అయితే ఓకే.

Monday, April 23, 2007

నాది జ్ఞానమా? అజ్ఞానమా?

కొన్నిరోజులక్రితం ఆంధ్రజ్యోతిలో ఒక ఫోటో, దానిక్రింద దాని వివరం చూసా. ఆవివరం లో నాగార్జునకొండకెళ్ళడానికి లాంచి ఎక్కుతున్న ప్రధాని కుమార్తె ఉపేంద్ర సింగు అని రాసి ఉంది. ఇది మీరూ చదివి ఉంటారు. దీంట్లో విశేషం ఏముందీ పెద్ద, బ్లాగులో వ్రాయడానికి, అదీ 'ఆర్నెల్ల' తర్వాత అంటారా? మామూలుగా చూస్తే అంతే. కానీ ఆవార్త చదివాకా నాలో కల్గిన భావపరంపరనుబట్టి చూస్తే విశేషం ఉందని మీరుకూడా ఒప్పుకోవచ్చు.
ఒకసారి ఫోటోచూసి వివరం చదివాను. ఆవ్యక్తి ఎవరో ఆవార్త ఎందుకు వేసారో అర్ధం కాక మరొక్కసారి చదివా. ప్రధాని కూతురట, ఏదేశ ప్రధాని కూతురయ్యుండొచ్చు? సింగు అని ఉందికాబట్టి నేపాలు ప్రధానేమో. అయినా ఈ పత్రికల వాళ్ళ బుర్రలిట్టా ఏడిసాయి. సరిగ్గా వివరాలు వ్రాసి తగలడచ్చు కదా. ఇలా బ్రెయిన్ టీజర్లిచ్చి అఘోరించకపోతే. బ్రౌజర్ మూసేసా. మర్నాడెప్పుడో అకస్మాత్తుగా బల్బు వెలిగింది. అవునూ, మన ప్రధాని మన్మోహన్ సింగు కదా, ఆయన కూతురన్న మాట ఈవిడ అని.
జనరల్ నాలెడ్జిలో ఉద్దండ పిండాన్ని కాను కాని, మరీ మన ప్రధాని ఎవరూ అని అంత మీమాంసలో ఎలా పడిపోయానో కదా.
ఇంతకీ నాది జ్ఞానమా? అజ్ఞానమా?

Wednesday, April 04, 2007

మత్తు వదలనూ - నిద్దుర మత్తు వదలనూ..ఎందుకొదలాలిబే?

మీలో చాలామంది 'మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా' అన్న పాటని వినీ, చూసీ ఉంటారు. పాండవులు లక్క ఇంట్లో ఉన్నప్పుడు, కాపలాగా, అప్రమత్తంగా ఉండాల్సిన భీముడు మత్తుగా నిద్ర పోతోంటే కృష్ణుడు ముసలి వాని రూపంలో వచ్చి కర్తవ్యం బోధిస్తాడు. భీముడు - అంత లావుండీ కూడా- ఒక ముసలివాడు చెప్పిన మాట విని బంగారం లాంటి నిద్ర పాడుచేసుకొన్నాడు. అయినా అన్నదమ్ములందరూ హాయిగా ముసుగెట్టి బజ్జుంటే నాకేంటీ ఈ కాపలా అని కాని, నీకేంటీ దురద అని గాని నిలదీయలేకపోయాడు. మరి శేషశాయని పేరొందిన వాడు వేరేవాళ్లని పడుకోవద్దంటే రోషం రావద్దూ? మరి ఒక వేళ నిలదీసినా న్యూస్ కవర్ చేసిన రిపోర్టర్ (వ్యాస్, వేద)మనకి అలా అచ్చెయ్యలేదేమో? అదే ఈ నాటి రిపోర్టర్లైతే, అప్పట్లో మన ప్రధానైన శ్రీమాన్ దేవగౌడ గారి కునుకుపాట్లను సచిత్రంగా అచ్చేసేసారు. ఆయన తెగ ఉడుక్కున్నాడు కూడా. ఇంకో ప్రధాని కీ.శే.పి.వి. గారు ఎప్పుడూ పడుకొన్నట్లే ఉండేవారు, కాని నిత్య జాగృతులని తర్వాత తేలింది. ఒక విషయం నాకర్ధమైందేమిటంటే, ముఖ్య, ప్రధాన మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు వాళ్లు పొద్దున్నే 'బ్రహ్మ' లేదా 'జెహోవా(?)' ముహోర్తంలో లేచేస్తామని, దేశం లేదా రాష్ట్రాన్ని దొబ్బడం (సారీ తప్పుగా అనుకోకండి, దొబ్బడం అంటే తొయ్యడం, ముందుకి తోయడం) గురించి తెగ ఆలోచిస్తామని తప్పనిసరిగా రాయించుకొంటారు. కాని, కీ.శే.అంజయ్య లాంటి అమాయకులు (నిజంగా)ఈ విషయం తెలుసుకోక తాము లేటుగా లేస్తామన్న సంగతి కూడా దాచుకోకుండా పోయిన దశాబ్దాల తర్వాత కూడా చంద్రబాబు లాంటి 'కృష్ణుల' చేత చెప్పించుకొంటారు. అయినా ఒక రకంగా చూస్తే అంజయ్య గారు చాలా అదృష్టవంతులు. ఆయన మీద వాలే ఈగల్ని తోలడానికి తెలంగాణా అ(ఉ)గ్ర నాయకత్వం సిద్ధంగా ఉంది (నాయకుడుంటే మిగిలిన వాళ్ళున్నట్లేకదా?). పి.జె.ఆర్. స్పందించాడు కానీ, అంత గొప్పగాలేదు. ఆయనేమన్నడు- తెలంగాణా ప్రజల్ని ....... అనడంభాభవ్యంకాదు, నిన్ను పైకి తీసుకొచ్చిన అంజయ్యనే విమర్సిస్తావా, ... ఇల్లాంటిఏమిటేమిటో చెప్పాడు. కేసీఆర్ అన్న మాత్రం బలే రిటార్టిచ్చాడు. 'మాయిష్టం పడుకొమ్టే పడుకొంటాం. అసలు లేవనే లేవం. ఏంటంటా? ఆయినా నీలా పొద్దుగాక ముందే లేచి గోతులు తవ్వం' అని మళ్ళీ ఎవరూ నోరెత్తకుండా చేశాడు. నాకైతే కేసీఆర్ పిచ్చపిచ్చగా నచ్చేసాడు. ఇప్పుడు హాయిగా మనం ఎంత సేపు పడుకొన్నాఅడిగేవాడు లేడు. అయినా తెలంగాణా ప్రజలు పడుకోబట్టే కదా నాయకులు ఇంతకాలం హ్యాపీగా పండుగ చేసుకొన్నారు. వాళ్లు నిద్ర మత్తులో ఉంటేనే కదా ఎవరేం చెప్పినా చెల్లేది. ఇపుడు వాళ్లు లేస్తే ఎన్ని సమస్యలు?