Tuesday, January 26, 2010

కొరియా కబుర్లు: నాలుగు నాళ్ళ అతిధి - లీ మ్యుంగ్ బక్

మన దేశానికి రిపబ్లిక్ డే అతిధిగా కొరియా రాష్ట్ర పతి లీ మ్యుంగ్ బక్ వచ్చిన సంగతి అందరికీ తెలిసినదే. ఆవిషయం వినగానే ఒక్కసారిగా నా కొరియా రోజులు నెమరుకు రావడం జరిగింది. నేనక్కడ ఉన్నప్పుడు శ్రీ లీ సియోల్ మేయర్ గా ఉండేవాడు. ఆయన పేరు చెప్పగానే నాకు గుర్తొచ్చేది జ్యోంగ్యిచియోన్ (Cheonggyecheon) కాలవ.  ఇది సియోల్ సిటీ హాల్ దగ్గరనుండి 10 కిమీ పైన ప్రవహిస్తుంది. దాని ఒడ్డున నడుచుకుంటూ పోవడం ఒక అనుభవం.  దీంట్లో గొప్పేముంది అంటారా.  ఈకాలవ పాతకాలం లో ఉండేది.  తర్వాత రోజుల్లో అభివృధ్ది పథంలో కాలవని మూసేసి, ఫ్లైఓవర్లు కట్టేయడం వల్ల అక్కడ ఓ కాలవ ఉండేదన్న విషయమే జనాలు మరచి పోయారు.  లీ మేయరుగా పోటీచేసినప్పుడు చేసిన వాగ్దానాలలో ఈకాలవ పునరుద్ధరణ ఒకటి.

ఎక్కడ చూసినా నీతిమాలిన రా.నా.లే ఉన్న లోకంలో పదవిలోకొచ్చి తన వాగ్దానాలని నెరవేర్చిన ఘనత శ్రీ లీ దే అయుండచ్చు. ఈకాలవ సియోల్ నగరానికి కొత్త శోభని తీసుకురావడంతో పాటు, ఒక సాంస్కృతిక కూడలిగానూ, పర్యావరణ పునరుద్ధరణ కృషికి సంకేతంగానూ శోభిల్లుతోంది.  నాస్నేహితుడితో పాటు నేను సుమారు 3 కిమీ నడిచా. అప్పుడు తీసిన కొన్ని జ్ఞాపికలు ఇక్కడ ఇస్తున్నా. 

Sunday, January 24, 2010

అసలైన హీరో .. మీరే అవచ్చు

మా స్నేహితుడు తనపై వచ్చిన ఒక ఫిల్మ్ కి లంకె పంపించాడు.

ఆసైట్లో మీ ఫొటో అప్లోడ్ చేస్తే మిమ్మల్ని హీరోగా పరిచయం చేసి ఆకాశానికి ఎత్తుతారు. 

ఆలంకె పట్టుకుని బాబాని హీరోగా పెట్టి తీసిన లఘుచిత్రం ఇక్కడ చూడండి. కొన్ని తెరపట్లు ,,,,,

image

image

Friday, January 08, 2010

శ్రావ్య పాటలు

శ్రావ్య వరాళి త్యాగరాయగానసభలో 6 డిసెంబరు 2009 న పాడిన పాటలు ఈస్నిప్పులో ఇక్కడ వినప్రార్ధన.
సత్యసాయి

Tuesday, December 08, 2009

త్యాగరాజు తెలంగాణా ద్రోహా?

ఆదివారం డిసెంబరు 6 న త్యాగరాజగానసభకి వెళ్ళాం. కిన్నెర ఆర్ట్స్ ధియేటర్ వాళ్ళు నిర్వహిస్తున్న నెలవారీ బాలల సాంస్కృతికోత్సవంలో మా అమ్మాయి చి.శ్రావ్యవరాళి (బ్లాగు: వరాళి వీచికలు) కర్నాటక సంగీత కచేరీ ఆరోజు 6 గంటలకి పెట్టిన సందర్భంగా అక్కడికి వెళ్ళాం.  ముందురోజు తెరాస కార్యకర్తలు త్యాగరాజ గాన సభ బోర్డుమీద తెలంగాణా వాగ్గేయకారుడు సుద్దాల హనుమంతు గానసభ అని, కళా సుబ్బారావు కళావేదిక (మినీ హాలు) బోర్డు మీద కాళోజీ కళావేదిక అని   ఎర్ర స్టిక్కర్లంటించారు. నిర్వాహకులు ఆరోజు, ఆతర్వాతి రోజు కార్యక్రమాలు రద్దు చేసారు. ముంబై నుండి వచ్చామని కనికరం తో మా అమ్మాయి కచేరీ జరిగింది. చాలామంది రావలసిన వాళ్ళు ఊర్లో పరిస్థితికి భయపడి రాలేదు.  చివరిదాకా ఉండిన అనిశ్చిత పరిస్థితివల్ల మేం కూడా ఎవరికీ ధైర్యంగా చెప్పనుకూడా లేదు. అయినా దేఁవుడి దయవల్ల హాలు సగం వరకూ నిండింది. కార్యక్రమం సవ్యంగా జరిగింది. ఆతాలూకు వార్తావిశేషం కింద చూడండి.   చి.శ్రావ్యకి మీ అందరి ఆశీస్సులు అందజేయమని ప్రార్ధిస్తున్నా. 

saakshi_cover

 

eenadu coverage

 

ఇదిలా ఉంచితే అసలు త్యాగరాజుకి తెలంగాణాకి సంబంధం ఏంటో నాకర్థంకాని విషయం.  ఆయనపేరుని ఈసభకి పెట్టడం కోస్తా ఆంధ్ర వాడని పెట్టారా? అలాగే కళాసుబ్బారావుకి త్యాగరాజగానసభకీ ఉన్న అనుబంధాన్ని పక్కకి తోసేసి కేవలం తెలంగాణా వాడని కాళోజీ పేరు పెట్టడంలో ఔచిత్యం ఏంటో?  పొట్టి శ్రీరాముల విగ్రహం, తెలుగు తల్లి విగ్రహం బద్దలు కొట్టడం తాలిబాను చేష్టలకి తీసిపోలేదు.  తెలంగాణాలో మాట్లాడేది తెలుగు కాదా?

Saturday, October 03, 2009

సత్యశోధన అవసరమా?

(ఈటపా ఎప్పుడో రాసినది .. అయినా సత్యశోధనకి సమయం మించిపోవడం ఉండదుకదా అని పోస్ఠ్ చేస్తున్నా.)

ఈమధ్యలోఎదుటి మనిషిచేత నిజం చెప్పించాలని ఓ టీవీ కార్యక్రమం కంకణం కట్టుకొంది.  స్టార్ ప్లస్ లో వస్తున్న సచ్ కా సామనా చూసే ఉంటారు.  మా పిల్లలు చెప్తే ఒక ఎపిసోడ్ చూసా.  తర్వాత మరొకటి. ఇందులో 21 ప్రశ్నలకి నిజం చెప్పగలిగితే కోటి రూపాయలు వస్తాయి.

మొదట చూసిన ఎపిసోడ్ లో ఒకావిడని (స్మిత అనుకుంటా) రాజీవ్ ఖండేల్వాలా (పృచ్ఛకుడు) ప్రశ్నలడుగుతూ పోయాడు.  ఆవిడ ఒక స్థాయికి వచ్చేసరికి, ఇబ్బందికరమైన ప్రశ్నలడగడం మొదలెట్టాడు. ఇది ఆయన స్ట్రాటజీ. ఒకస్థాయినుండి ఇంకో దానికి వెళ్ళేముందు షోనుండి వెళ్ళిపోవడానికి అవకాశం ఇస్తారు.  ఇంకా ముందుకెళ్తుందనుకున్నఆవిడని అడిగిన ప్రశ్న.. మీపతికి ఎప్పటికీ తెలియదని మీకు నమ్మకంగా తెలిస్తే మీరు వేరేమగవాడితో పడుకుంటారా? ఆడమగ సంబంధాలలో ఎన్ని రకాల శృతులూ, అపశృతులూ ఉంటాయో అవగాహన ఉన్నా, ఈప్రశ్న అడగడం ఎబ్బెట్టుగా అనిపించింది. దీనికి ఆవిడ నో అన్నా, పోలీగ్రాఫ్ ఒప్పుకోలేదు. అప్పటి ఆవిడ పరిస్థితి ఎంత దుర్భరమో ఊహించండి. అందులోనూ ఆవిడమొగుడు అక్కడే ఉన్నాడు.  

నే చూసిన రెండో ఎపిసోడ్లో పాల్గొన్నాయన చాలా  ఓపెన్గా ఉన్నాడు. తీరా ముందుకు వెళ్తున్న సమయంలో, మీరు విదేశం వెళ్ళినప్పుడు అక్కడ వేశ్య…  అని ప్రశ్న మొదలెట్టగానే వాళ్ళావిడ బజ్జర్ నొక్కి ఆప్రశ్నపట్ల తన వ్యతిరేకత తెలియచెప్పింది (షోలో కూడా వచ్చిన వారికి తమ అభ్యంతరం షోలో ఒక్కసారి చెప్పే అవకాశం ఇస్తారు).   వెంటనే పృచ్ఛకుడు ప్రశ్నమార్చి మీరెప్పుడైనా మీభార్యని మోసం (పరాయసంబంధాలు పెట్టుకోవడం ద్వారా) చేసారా అని  ప్రశ్నించాడు.  దీనికి ఆయన పెళ్ళాం ఎదురుగా  ఏంచెప్పాలో తికమక పడి లేదన్నాడు. పోలీగ్రాఫ్ పరీక్షప్పుడు ఎస్సని ఇప్పుడు నో అనేసరికి ఆమానవుడు షోనుండి వెనుదిరగాల్సొచ్చింది.  తర్వాత అక్కడికక్కడే తన భార్యముందు చాలా ఇబ్బంది పడ్డాడు.

అసలు ఈపోలీగ్రాఫ్ ఏంటయ్యా అంటే మనం సమాధానాలు చెప్పినప్పుడు మన శరీరంలో జరిగే మార్పులని, రక్తపీడనాన్ని బట్టి మనం చెప్తున్నది నిజమా, అబద్ధమా అన్నది నిర్ధారిస్తుంది. అది ఎంత ఖచ్చితంగా నిర్ధారించగలదూ అన్న విషయం పక్కనపెడితే, అసలు ఇంత కష్టపడీ, పెట్టీ  నిజం చెప్పించడం, షోకోసమైనా సరే, అవసరమా? 

అవసరమైనప్పుడు అంటే ప్రాణమానవిత్తభంగములందు అబద్ధమాడచ్చునన్నది ఆర్యవాక్యం. ఇవన్నీ భంగమైనా సరే నిజం చెప్పించడం మాత్రమే మన టీఆర్పీ రేటింగ్‌కి అవసరం అన్నది వ్యాపార సూత్రం అనుకుంటా.

ఎంత అబద్ధాల కోరైనా ఆవిషయం ఒప్పుకోడు. తనంత సత్యసంధుడు ఎవరూ లేరనే అనుకుంటాడు.  సత్యం శివం సుందరం అన్న భావనలో ఇది ఒక కోణం అని ఒకాయన సెలవిచ్చాడు. అలాగే ఎవరినైనా నిజం చెప్పు… నిజం చెప్పని రాపాడిస్తే వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు.  ఇంకా ఘోరం ఏంటంటే నిజంగా నిజం చెప్తున్న వ్యక్తిని నిజం చెప్పు అని నిలదీస్తూ పోవడం. అప్పుడావ్యక్తికి కలిగే మానసిక వేదన అంతా ఇంతా కాదు.   ఇలాంటి సందర్భం మొగుడూ పెళ్ళాల మధ్య వస్తే ఇంక చెప్పక్కరలేదు.

సాధ్యమైనంత వరకూ నిజాయితీగా, సత్యవాదిగా ఉండడం ఆదర్శప్రాయంగానూ, అత్యుత్తమ జీవన విధానంగానూ ఒప్పినా చాలాసందర్భాల్లో, అబద్ధం చెప్తున్నారని తెలిసినా కూడా ఎదుటివారికి ఎంతో కొంత వెసులుబాటు వదలడం విజ్ఞత.

Monday, September 28, 2009

విజయదశమి శుభాకాంక్షలు

 

అందరికీ నా విజయదశమి శుభాకాంక్షలు.  మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవాలని కోరుకుంటున్నా. ఈరోజు శిరిడీ సాయిబాబా గారు సమాధి చెందిన రోజు. ఆసందర్భంగా మాఇంటనున్న బాబాకి అభిషేకం చేసి నూతనవస్త్రం సమర్పించాం.  ఆయన చిత్రం ఇదిగో ఇక్కడ. 

 wmcellphotos 023

ఆయన బోధించిన కొన్ని సూక్తులు ఇక్కడ వ్రాస్తున్నా (ఎక్కిరాల భరద్వాజ గారి శ్రీసాయి లీలామృతము నుండి).  అవి కొంతవరకైనా పాటించగలిగితే మనమూ, పక్కవాళ్ళు కూడా ఆనందంగా, సుఖంగా ఉండచ్చు.

  • నాపై పూర్తి విశ్వాసముంచు, నీకోరికనెరవేరుతుంది.
  • నాపైనీ దృష్టినిలుపు, నేనూ నీపై దృష్టినిలుపుతాను. నిన్నుచివరికంటా గమ్యం చేరుస్తాను. నన్నునమ్మినవారినెప్పుడూ పతనం కానివ్వను.
  • నాసమాధినుండి కూడా నేను నాకర్తవ్యంనిర్వర్తిస్తాను. నానామం పలుకుతుంది. నామట్టి సమాధానం చెబుతుంది.
  • నీవు చూసేదంతాకలిసి నేను. సాయి శిరిడీ లోనే ఉన్నారనుకునేవారు నన్నుఅసలు చూడనట్లే.
  • రోపొకనాటికి చావబోయేవారు కూడా ఇతరులను చంపడానికి పన్నాగాలు చేస్తుంటారు. వారు నాకంతో బాధకలిగిస్తారు.
  • ఎవరికెవరు శత్రువులు? అంతా ఒక్కటే.
  • నాభక్తుని ఇంట్లో అన్నవస్త్రాల లేమి ఉండదు.
  • ఇచ్చిన మాట తప్పక నెరవేర్చు.
  • పోటీలు, కీచలాటలు మానితే దేవుడు కాపాడుతాడు.
  • నీవేమి చేసినా క్షుణ్ణంగా చేయి. లేదా చేస్తానని ఒప్పుకోకు.
  • ఎవరిసేవని ఉచితంగా తీసుకోవద్దు. ఉదారంగా ప్రతిఫలమివ్వు.
  • నిన్నెవరైనా ఏమైనా అడిగితే సాధ్యమైనంతవరకూ యివ్వు. లేకపోతే యిప్పించు. ఇచ్చేందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పు. చులకన చేయడం, కోపగించుకోవడం తగదు.
  • నీదగ్గరున్నా ఇవ్వాలనిపించకపోతే లేదని అబద్ధం చెప్పకు.  ఇవ్వలేనని మర్యాదగా చెప్పు.
  • ఎవడు ధైర్యంగా నిందని దూషణని స్వీకరిస్తాడో వాడు నాకెంతో ఇష్ఠుడు.
  • నిన్నెవరైనా బాధించినా పోట్లాడవద్దు. సహించలేకపోతే ఒకటిరెండు మాటలలో ఓర్పుగా సమాధానం చెప్పు. లేకుంటే నా నామం స్మరించి అక్కడి నుండి వెళ్ళిపో.
  • నీవెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది.
  • ఎవ్వరిగురించీ తప్పుగా మాట్లాడకు. నీగురించి ఎవరైనా మాట్లాడినా చలించకు.
  • ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు. నీవు చేసినపనులకి ఫలితమే నీకుంటుంది.
  • అసూయ వద్దు. అవతల వారికి మేలు జరిగితే మనకే జరిగినట్లు భావిద్దాం. లేదా మనం కూడా ఆమేలు పొందే యత్నం చేద్దాం. ఎవరి కర్మననుసరించి వారు ఫలితాన్ని పొందుతారు.
  • దైవమిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలువదు.
  • దుఃఖం లేకపోవడమే ముక్తి.
  • మనను భగవంతుడెలా సృష్ఠించాడో అలాగే తృప్తిగా ఉండాలి.

శిరిడీని దర్శించే వారి సంఖ్య నిమిషనిమిషానికీ ఎక్కువైపోవడం చూస్తూనే ఉన్నాం. ఆయనని ఆశ్రయించి ఆయన సహాయం అనుభవించిన వారెందరో.  ప్రస్తుతం మనచుట్టూఉన్న సమస్యలు, అనిశ్చిత పరిస్థితులలో  మానసిక స్థైర్యం పొందడంకోసం ఏదో దైవాన్ని ఆశ్రయించడం, చాలామంది శిరిడీ సాయినాశ్రయించడం  మనకి కనిపిస్తోంది. నమ్మిన వారిని పతనం కానివ్వనని చెప్పిన మాటని తూచా తప్పక పాటించే కామధేనువు బాబా.  కానీ చాలామందిమి బాబా భక్తులమవుతున్నామే కానీ మోసాలు, కుళ్ళు వదలలేక పోతున్నాం. మనని బట్టి బాబాకే చెడ్డపేరు వచ్చేంత చెత్తగా ప్రవర్తిస్తున్నాం.  ఇవే కాస్త తగ్గించు కోడానికి ప్రయత్నించడమే నిజమైన సాయిదీక్ష.   

పై బోధలను మననం చేసుకుంటూ పాటించడానికి ప్రయత్నం చేయడమే మనం ఆయనకివ్వగల గురుదక్షిణ.

సమర్ధ సద్గురు శ్రీ సాయి నాధాయ నమః

నేనీమధ్య కొన్న విండేసు మొబైలు కోసం తయారు చేసుకున్న థీం నా చిరుకానుక ఇక్కడి నుండి దింపుకోవచ్చు.

Tuesday, June 30, 2009

పోతీ డాట్ కం లో నా చిన్న పుస్తకం

 

ఆమధ్య నేను కవిత్వం డిసైడ్ చేసా.

ఈ మధ్య చావా కిరణ్ పుస్తకం పోతీ లో చూసి నేను కూడా స్పూర్తి పొంది ఓచిన్న పుస్తకం  పెట్టా.  ఇదిగో ఇక్కడ చూడండి.

saikruthulu

భవదీయుడు

సత్యసాయి కొవ్వలి

Wednesday, April 22, 2009

తిరగబడిన మర్ఫీ సూత్రం

మర్ఫీ సూత్రం (Murphy's Law) మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అనుభవమూ అయ్యే ఉంటుంది. మనం ఎంత బాగా అన్ని అంశాలూ ఆలోచించి పధ్ధతిగా ప్రణాళిక ప్రకారం పని చేస్తున్నా కూడా అనుకోని అవాంతరం వచ్చే అవకాశం ఉంటుందని ఈ సూత్రం సారాంశం. కానీ ఈమధ్య జరిగిన ఒక సంఘటనతో దీన్ని తిరగరాయాల్సి వచ్చింది.

శ్రావ్యంగా తెలుగులో ఇక్కడ -అమ్మో ఎన్నాళ్ళయ్యింది -3 మాత్రం కాదు

అది నా మాటలలో ఇక్కడ - Reverse Murphy Law & Long blog(hol)iday

త్వరలోనే మళ్ళీ ఇవే బ్లాగ్వరుసలపై కలుద్దాం.

సత్యసాయి

Tuesday, April 14, 2009

ముంబై ముచ్చట్లు – సింగపూరిండియా, జ్ఞానశూన్యత, పిండొడియాలు

ముచ్చట్లంటే ఒకదానికీ మరోదానికీ సంబంధం ఉండాలని రూలులేదుగా.  అలాగే  టైటిల్ లో కూడా. 

సింగపూరిండియా

నాక్రిందటి టపాకి  స్పందిస్తూ నాగన్న గారు సింగపూర్ వాళ్ళ ఫైన్లేసే విధానాన్ని కొనియాడారు.  మేం ఒకమూడు రోజులు అక్కడ తిరిగాం. మేం విన్నది, అక్కడి మా స్నేహితుడు చెప్పినదీ నా ఒత్తిడిని పెంచేయగా, నేను మా పిల్లలమీద ఒత్తిడి పెంచేసా. ఒకసారి మా అబ్బాయి అతి చిన్న చాక్లేట్ కాగితం ముక్క పడేయగానే చాలా టెన్షన్ పడిపోయా. అలా టెన్షన్ పడుతూ కాస్త దూరం నడవగానే స్వర్గంలో అడుగు పెట్టిన అనుభూతి.  హఠాత్తుగా కిందా మీదా కుడీ ఎడమా అంతా చెత్తే చెత్త.  ఒకరికొకరు  రాసుకుంటూ పూసుకుంటూ జనాలే జనాలు.  అటు చూస్తే రోడ్డుమీద అటూనిటూ అడ్డంగా పరిగెడుతూ మనలా కనిపించే మనుషులు.  మొత్తం మీద అంతా అలవాటైన వాతావరణం.   హాయిగా ఉంది. అకస్మాత్తుగా ఇండియాలో ఉన్న అనుభూతి. చిన్న చాక్లేట్ కాయితం పడేసినందుకు ఇంత జబర్దస్తీగా ఇండియాకి డిపోర్టు చేసేసారా అన్నంత సంభ్రమంలో ఉన్న సమయంలోనే దీన్నే మినీఇండియా అని అంటారు అని మా ఫ్రెండు చెప్పాడు. ఓహొ మేమింతే  ఇలాగే ఉంటాం అన్న తత్వం.  సింగపూర్ వాళ్ళే చేతులెత్తేసారు మనవాళ్ళ ధాటికి.

లాలూతో ఒక జపానీ మీ బీహారివ్వండి 10 ఏళ్ళలో జపాన్ చేస్తాం అన్నాడట. దానికి లాలూ మీ జపానివ్వండి 10 నిమిషాలలో బీహార్ గా చేసేస్తా అని ఠపీమని సమాధానం చెప్పాడట.  

జ్ఞానశూన్యత

ఒకసారి మాసహోద్యాగి ఒకావిడతో అన్ని బాధలకన్నా పన్ను బాధ భరింపలేనిదన్నా.  ఆవిడ ఒప్పుకోలేదు.  నాల్గురోజులతర్వాత ఆవిడకి పన్ను నెప్పి వచ్చి బాధపడగానే నాదగ్గరకి వచ్చి మీరన్నది పచ్చినిజం అని చెప్పి పోయింది.  నోట్లో పన్నైనా, నోట్లు లాక్కునే పన్నైనా ఆబాధ  పడ్డవాళ్ళకే ఎరుక. ఇంటర్మీడియట్ ఆప్రాంతంలో వచ్చిన జ్ఞానదంతాలు అడపా దడపా ఇబ్బంది పెడుతూ ఉండేవి.  ఐదు సంవత్సరాల క్రితం ఒకటి పీకించుకోవాల్సి వచ్చింది. మళ్ళీ నిన్న ఒకటి పీకించుకున్నా.   జ్ఞానం రావడం ఎంత బాధాకరమో చూపించిన నాజ్ఞానదంతాలు, జ్ఞానశూన్యత ఎంత హాయో తెలిపాయి. అసలుకి నా జ్ఞానదంతాల్లో ఏసమస్యా లేదని డాక్టరు చెప్పాడు. ఇంతకుముందు పీకబడిన దంతం వంకరగా పెరిగి ముందుపన్నుమీద ఒత్తిడి కలగచేయడంవల్ల ఇబ్బంది కలిగించిందట. నిన్న పీకిన దంతం ముందున్న దంతాన్ని అంటుకుని ఉందట. ముందు పంటిమీద ఏర్పడిన కేవిటీ (క్షయం) వల్ల నెప్పికలిగిందట. కానీ ఆపన్నుని బాగుచేయాలంటే జ్ఞానదంతాన్ని తీసేయాల్సిందే అని పీకిపారేసారు.  మన జ్ఞానం ఎవరికైనా అంటించదలుచుకుంటే మనకే నష్టం అన్న మాట.  ఏమైతేనేం ప్రస్తుతానికి నేను జ్ఞాన(దంత) శూన్యుడినయ్యా. Ignorance is bliss అన్నాడు కదా తెల్లవాడు. Let me be blissful.

పిండొడియాలు

ఈవేళ మా అమ్మ పిండొడియాలు పెట్టింది.  అదేం గొప్ప అంటారా. స్వగృహా లలో కొనుక్కోవడం తప్ప ఈమధ్య ఎవరైనా ఇలాంటవి ఇంట్లో తయారు చేస్తున్నారా.  ఒక గంటపైగా పిండి, సగ్గుబియ్యం కలుపుతూ ఉడకబెట్టి డాబామీదకి తీసుకెళ్ళి వడియాలుగా వేసి ఎండబెట్టాలి. పిండి ఉడకబెడుతూంటే నేనెళ్ళి కాస్త గంజి ఒక గిన్నెలో పోయించుకున్నా. ఆనిమిషం పాటు కలపక పోవడంవల్ల అడుగంటేసి మాడు వాసనే సేసిందని నామీద అభయోగం వేసింది మా అమ్మ.  తర్వాత అమ్మ, నేను, శ్రావ్య (తనకి ఇలాంటి ఫేమిలీ ఏక్టివిటీసంటే ఇంటరెస్టు) డాబామీదకి వెళ్ళి గుడ్డలు పరిచి గంజిని వడియాలుగా మార్చేం. 

మాచిన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వంతులవారీగా వడియాలు, అప్పడాలు, ఊరగాయలూ పెట్టుకునే వారు. మాయింట్లో అప్పడాలు చేసుకుంటే పక్కవాళ్ళు వచ్చి వత్తేవారు.  అలాగే వాళ్ళెవరింట్లోనైనా అప్పడాల ప్రోగ్రాం ఉంటే అప్పడాలకర్రా, పీటా తీసుకుని మా అమ్మ తయారు. ఎవరింట్లో పదార్ధాలు బాగున్నాయోనన్న అంశంమీద తెలియని పోటీ, గుసగుసలు, చెవులుకొరుక్కోవడాలు మామూలే.

ఒక్కసారిగా మా చిన్నప్పటి జ్ఞాపకాలు నన్నూ, మాఅమ్మనీ చుట్టుముట్టాయి.  వాటితో పాటు కాకులు కూడా.  ముందోకాకి వచ్చింది.  దానికీ ఇదో వింటేజెఫైరని అనిపించిందనుకుంటా కావుకావని ఫ్రెండ్సుని పిలిచేసింది. నిమిషాల్లో చుట్టూ కావులే కావులు. వాటి ఆనందం చూసి మాకానందం వేసింది.  సాయంత్రం వెళ్ళి చూడాలి ఏమైనా మాకోసం వడియాలు మిగిల్చోయో లేక అన్నీ తినేసాయో.

Saturday, April 11, 2009

ముంబై ముచ్చట్లు – పాన్ చిరాక్

పాన్

తాంబూలసేవనం మనదేశంలో కొత్త కాదు. అలాగే పెళ్ళాం మొగుడికి చిలకలు చుట్టి నోట్లో పెట్టడం చాలా రోమాంటిక్ సన్నివేశమని చాలా సినిమాలద్వారా డోకొచ్చేంతగా తెలిపారు.  ఇదే సర్వవ్యాపకమైన పాన్. హైదరాబాదులో ఉన్న ఒక పాన్ దుకాణంలో అతి ఖరీదైన పాన్లు (వయాగ్రా పాన్లతో సహా) దొరుకుతాయని ఆమధ్య పేపర్లో పెద్దగా చదివా.  దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పాన్ (తిన్నా) దొరికినా తూర్పు రాష్ట్రాలలో తిన్నంత ఇంకెక్కడా తినరేమో. పాన్ తినడం పెద్ద సమస్య కాదు కానీ దాన్ని నమిలి ఉమ్ములేసే వాళ్ళతోనే పేద్ద తలనెప్పి. మేం ఇఛ్ఛాపురంలో ఉన్న రోజుల్లో స్కూలు దారిలో రోడ్డుమీదే బస్సులాగేవి. వాటిల్లోనుంచి చూడకుండా ఉమ్ములేసే ప్రయాణీకులవల్ల వాటి పక్కనుండి వెళ్లడం దిన దిన గండంగా ఉండేది. ఆతర్వాత ఒకసారి విజయనగరం రైల్వే స్టేషనులో కిళ్ళీ ఉమ్ములతో ఎర్రబారిన ఒకప్లాట్ ఫాం చూడగానే ఒరిస్సా వెళ్ళే రైళ్ళక్కడనుండే వెళ్తాయని చెప్పగలిగా. అలాగే అదే జనరల్ నాలెడ్జ్ తో భుభనేశ్వర్ లో ఆర్బీఐ బిల్డింగుకి కిళ్ళీ రంగెందుకేసారో కూడా తెలిసేసుకున్నా. నిన్న ఇక్కడి పేపరులో కిళ్ళీనమిక్స్ చదివి కిళ్ళీ గొప్ప తెలుసుకుని హాశ్చర్యపోయానని తెలుసుకున్నా. కొన్ని వివరాలు మీకు కూడా చిలకలు చుట్టి యిస్తా.

ముంబై లోకల్ రైళ్ళమీద పడిన కిళ్ళీమరకలని శుభ్ర పరచడానికి మధ్య రైల్వేవాళ్ళు రూ87 లక్షలు, పశ్చిమరైల్వే వాళ్ళు 57 లక్షలు ఏటా ఖర్చుపెడుతున్నారట. దానికోసం 63000 పని గంటలు వినియోగిస్తున్నారట.  తాగడానికి నీళ్ళులేక కోట్లాది ప్రజలు ఇక్కట్లు పడుతోంటే ఇక్కడ ఎన్ని నీళ్ళు  వృధా అవుతున్నాయో మీరే ఆలోచించండి.  పాన్ తినద్దని అనడంలేదు కానీ నమిలి ఎక్కడపడితే అక్కడ ఉమ్మడం హీరోయిజం కాదని తెలుసుకుంటే ఎంత బాగుంటుందో కదా.  పాన్ బనారస్ వాలా అమితాబ్ చేత చెప్పిస్తే!  ఇది ఇలాఉంటే, ముంబై మునిసిపల్ కార్పొరేషన్ వాళ్ళు యధేచ్ఛగా ఉమ్ములూ, ఉచ్చలూ పోసేవాళ్ళ నుండి 2007 నుండి సుమారు లక్ష మంది నుండి జుర్మానా గా వసూలు చేసినది 4.27 కోట్లు.

ఈఉమ్ముల బాధకి తట్టుకోలేక ఈమధ్య చాలా భవనాలలో మూలల్లో త్రిమతాల దేవుళ్ళు, మత చిహ్నాలూ ఉన్న టైల్సు పెడుతున్నారు.

చిరాక్

ఒత్తిడీ , దాని వల్ల వచ్చే చిరాకులలో మనుషులు ఎలాంటి అకృత్యమైనా చేసేస్తారని ముంబైలో నిన్న జరిగిన సంఘటన పై స్పందిస్తూ ఒక మానసికనిపుణుడు సెలవిచ్చారు. ఒక తండ్రీకొడుకులు కారులో వెళ్తూ బెస్టు బస్సు సైడివ్వలేదని అలిగి ఆబస్సాపి డ్రైవరుమీద తిరగబడ్డారట. విడతీద్దామని దిగిన ప్రయాణీకులని తమవద్దనున్న గన్నుతో బెదిరించి, జనం మరీ  తిరగబడగలరేమోనన్న అనుమానంతో గాలిలో పేల్చి ఆనక పరారైపోయారట.  కండక్టర్ కారు నంబరు పోలీసులకి చెప్పగా, వాళ్ళు నేరస్థులని పట్టుకుని జైల్లో పెట్టారు. ఎంత చిరాకైనా మరీ ఇంత అకృత్యమా.  పెంపకలోపం ఒకకారణమని నిపుణుడు చెప్పాడు. నాఉద్దేశ్యంలో కష్టపడకుండా డబ్బులూ, సుఖాలూ వస్తే పిల్లలు ఇలా తయారవుతారేమో ననిపిస్తోంది.   డబ్బు విలువ తెలియని వాడికిమనుషుల విలువ మాత్రం తెలుస్తుందా.

కొసరు

జ్యూసులు తాగేవాళ్ళు, ఘన పదార్ధాలు తినేవాళ్ళకన్నా ఎక్కువగా లావెక్కుతారని ఇటీవలి పరిశోధన సారాంశం.   అలాగే మధ్యాహ్నం లంచి కాకుండా లైట్ గా జ్యూసో గీసో తాగేస్తే బాగా పని చేసుకోవచ్చుగా అని ఒక అమ్మడడిగితే, మా ముంబై తిండి నిపుణురాలు ససేమిరా అలా చేయద్దని లైట్ గా పప్పూ అన్నమో, కూరా రొట్టో తినమని సలహా చెప్పింది.  వేసవి కదా అని ఊరికే రసాలు తాగకుండా తినండి- నేను హార్లిక్స్ తాగను తింటాను స్టైలులో.  మీకు తెలిసే ఉంటుంది – బెంగాలీలు వాళ్ళ భాషలో ద్రవాలని (ఉదా. చాయ్) కూడా తినడం అనే అంటారు.

ఇంకోసారి ఇంకొన్ని ముచ్చట్లతో …